వైయస్ వివేకానంద రెడ్డి మృతి: అలాంటి నేతల్లో ఒకరు... గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం
హైదరాబాద్: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మృతి పట్ల నల్గొండ ఎంపీ, తెరాస నేత గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్రమశిక్షణ, అంకితభావం గల నాయకుల్లో వైయస్ వివేకా ఒకరు అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.
జగన్ కుటుంబంలో విషాదం : వైయస్ వివేకా కన్నుమూత : పులివెందులకు జగన్..!
వైయస్ వివేకానంద మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప మానవతావాది అని వైసీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ఉంటూ సామాన్యులకు అందుబాటులో ఉండేవారన్నారు. తన తమ్ముడు చాలా సౌమ్యుడనివైయస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మరణం చాలా బాధ కలిగించిందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, జగన్ చిన్నాన్న వైయస్ వివేకా (68) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. పులివెందులలోని ఆయన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 1950 ఆగస్ట్ 8న పులివెందులలో వివేకా జన్మించారు. వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.
కడప లోకసభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999, 2004), పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) గెలిచారు. 2009లో సెప్టెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఉమ్మడి ఏపీలో 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2011లో జరిగిన ఉప ఎన్నికలో వైయస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయారు.
వైయస్ వివేకా మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆయన ముఖం సహా పలుచోట్ల గాయాలు ఉన్నాయి. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పులివెందులలో ఫిర్యాదు కూడా అందింది. ఈ మృతిని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా చెప్పారు.