'ఎదిరించి బతికే ధైర్యం లేకనే': గుత్తా సోదరుడి భార్య ఆత్మహత్యలో కొత్త కోణం..
పిల్లలకు క్షమించమని కోరుతూ.. ఆమె రాసిన ఆత్మహత్య లేఖ వారిని కన్నీరుమున్నీరయ్యేలా చేసింది.
చిట్యాల: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి భార్య ఆత్మహత్య నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. అనారోగ్య సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణమని తొలుత భావించినప్పటికీ.. ఆమె రాసిన సూసైడ్ లెటర్ వేరే కోణాన్ని బయటపెట్టింది.
ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడి భార్య ఆత్మహత్య: కారణమిదేనా?
భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పే ఆమె ఆత్మహత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దానికి తోడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో భూ వివాదం గురించి కూడా ఆమె కలత చెందినట్లు సమాచారం. పిల్లలకు క్షమించమని కోరుతూ.. ఆమె రాసిన ఆత్మహత్య లేఖ వారిని కన్నీరుమున్నీరయ్యేలా చేసింది.
ఇదీ సూసైడ్ లెటర్:
'ఏ తల్లైనా తన పిల్లలు సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది. నాలో ఏ తప్పులూ లేవు. కానీ మిమ్మల్ని ఎదిరించి బతికే ధైర్యం నాకు లేదు. నా బాధ్యత ఒక్కటే.. చింటు చదువు. చింటు చదువుకు ఆటంకం కలుగుతోంది. చింటూ నీవు ఎంచుకున్న మార్గం చాలా బాగుంది. నా కోరిక మేరకు నీవు బాగా చదవుకో. ఎలాగైనా ఉద్యోగం సంపాదించు. చింటు, మౌనిక నన్ను క్షమించండి.'
నేపథ్యం:
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన గుత్తా మహేందర్ రెడ్డి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పినతల్లి కుమారుడు. మహేందర్ రెడ్డి భార్య శ్రీలత(45) గ్రామంలోనే వ్యవసాయ పనులు చేస్తోంది. గేదెలను సాకుతూ ఇంటింటికి పాలు కూడా పోస్తోంది. మహేందర్రెడ్డి-శ్రీలత దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు ఎంటెక్ చదువుతుండగా.. కొడుకు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.
సూసైడ్ చేసుకున్న రోజు:
ఎప్పటిలాగే గురువారం ఉదయం కూడా శ్రీలత ఇంటింటికి పాలు పోసి వచ్చింది. అప్పటికే భర్త మహేందర్ రెడ్డి పొలానికి వెళ్లిపోగా.. కుమార్తె ఇంకా నిద్రలోనే ఉంది. స్టోర్ రూంలోకి వెళ్లిన శ్రీలత ఆ గదిలోనే ఉరివేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో కొన్ని వివరాలు మాత్రం రాసింది.
'మిమ్మల్ని ఎదిరించే ధైర్యం లేదు..':
ఎంపీ గుత్తాతో భూ వివాదానికి సంబంధించి మహేందర్ రెడ్డి భార్య శ్రీలత కలత చెందినట్లు తెలుస్తోంది. దానికి తోడు ఇటీవల మహేందర్ రెడ్డి ప్రవర్తన సరిగా లేకపోవడం కూడా ఆమెను తీవ్రంగా బాధించిందని సమాచారం.
ఎంపీ గుత్తాకు ఉరుమడ్లలో ఉన్న కోళ్ల ఫారంలో పనిచేయడానికి ఇటీవల కేరళ నుంచి ఓ యువతి వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా భర్త ఆమెతో చనువుగా ఉంటున్నట్లు శ్రీలతకు తెలిసింది.
దీంతో అప్పటినుంచి ఆమె మానసికంగా చాలా కుమిలిపోయినట్లు తెలుస్తోంది. చిట్ ఫండ్ డబ్బులు రూ.6లక్షలు కూడా భర్త ఆమె కోసమే ఖర్చు చేశాడని ఆమెకు తెలిసింది. 'మిమ్మల్ని ఎదిరించి బతికే ధైర్యం నాకు లేదు. అందుకే చనిపోతున్నా' అని ఆమె సూసైడ్ లేఖలో పేర్కొనడం ఆమె ఆవేదనను స్పష్టం చేస్తోంది.