రాష్ట్రంలో నేటినుండి ఒంటిపూట బడులు.. వద్దన్న మాజీమంత్రి హరీష్ రావు
తెలంగాణా రాష్ట్రంలో నేటి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ, ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనున్న నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పని చేస్తాయి.
సర్వేలో స్కూల్ టీచర్లు.. అందుకే ఒంటిపూట బడులు
ఇక ఈ ఒంటి పూట బడుల విధానం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఆయా స్కూళ్ల టీచర్లు మూడు వారాలపాటు కుల గణనలో పాల్గొంటారని, కాబట్టి ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్నం వరకే పనిచేస్తాయని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలలు ఒంటి గంట వరకు పనిచేసినప్పటికీ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాల్సిందేనని తెలంగాణా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

సర్వే పూర్తయ్యే వరకు ఒంటిపూట బడులు
ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని రేవంత్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సేవలను ఈ సర్వేకు వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
ఒంటిపూట బడుల నిర్ణయంపై మండిపడిన మాజీ మంత్రి హరీష్ రావు
అయితే ఈ ఒంటిపూట బడులు కేవలం ప్రైమరీ పాఠశాలలకు మాత్రమే వర్తించనుందని, హైస్కూళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయంతో తాజాగా నేటి నుండి కొనసాగునున్న ఒంటి పూట బడుల పైన మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఒంటిపూట బడులు పెట్టొద్దని డిమాండ్ చేశారు.
విద్య హక్కు చట్టాన్ని ఉల్లంఘించటమే
ప్రభుత్వం చేపడుతున్న కుల గణన నుంచి ప్రభుత్వ స్కూల్లో టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్య హక్కు చట్టాన్ని ఉల్లంఘించి టీచర్లను కుల సర్వేలో ఉపయోగించడం మంచిది కాదని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వే కోసం స్కూల్స్ ను మధ్యాహ్నం వరకు నడపడం సరికాదన్నారు.
పిల్లలకు, తల్లిదండ్రులకు ఇబ్బంది
ఆకస్మాత్తుగా ఒంటిపూట బడులు నడపడం కారణంగా పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా ఇబ్బందులకు గురవుతారని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్కూల్స్ పై నమ్మకం దిగజారిపోతుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థులు బలి కావలసిన అవసరం లేదని హరీష్ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications