బీజేపీకి షాకిచ్చిన ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం: సభకు అనుమతి నిరాకరణ, ఇక కోర్టుకే
వరంగల్: భారతీయ జనతా పార్టీకి హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం షాకిచ్చింది. ఏర్పాటు చేసుకున్న సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 27న ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు.
Recommended Video
ఆయితే ఈ సభకు అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. బీజేపీ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్లే తాము కూడా అనుమతి ఇవ్వడం లేదని కాలేజీ యాజమాన్యం తెలిపింది. అయితే ఇప్పటికే పోలీసులు అడ్డుకోవడంతో వాయిదా పడిన ప్రజాసంగ్రామ యాత్రకు ఇవాళ హైకోర్టు అనుమతిచ్చింది.
ఈ నేపథ్యంలో భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న బీజేపీ శ్రేణులు అనుమతి నిరాకరణపై మరోసారి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ యాజమాన్యం అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
సభ ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతి రద్దు చేయడం సరికాదని బీజేపీ నేత మనోహర్ రెడ్డి అన్నారు. హనుమకొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని మనోహర్రెడ్డి తెలిపారు. బండి సంజయ్ పాదయాత్రకు కూడా కోర్టు నుంచే అనుమతి లభించిందని, తాము సభకు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి తీసుకుంటామన్నారు.