ఢిల్లీలో హరీష్ రావు బిజీ: మూడో సిసిఐ కేంద్రం కోసం వినతి
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా మూడో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ పాండాకు విజ్ఞప్తి చేశామని తెలంగాణ మంత్రి హరీష్రావు తెలిపారు. మంగళవారం ఢిల్లీకి వెళ్లిన మంత్రి హరీష్రావు కేంద్రమంత్రులు, ఎంపీలను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.
అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ఉత్పత్తి ఎక్కువ జరిగిందని కేంద్రం 84 సీసీఐ కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పి 48 మాత్రమే ప్రారంభించారని అన్నారు. పత్తి మద్దతు ధరను పెంచి సీసీఐ కొనుగోళ్లను చేపట్టాలని కోరినట్టు వెల్లడించారు.
రూ. 1024 కోట్లతో 17లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నిర్మాణాలను చేపడుతున్నట్టు తెలిపారు. గోదాముల నిర్మాణానికి ప్రైవేట్ వ్యక్తులకు 25 శాతం రాయితీ ఇస్తున్నరన్న మంత్రి రైతులపై ప్రీమియం భారం తగ్గించి రాష్ట్రం, కేంద్రం భరించాలని కోరామని చెప్పారు.
మంత్రి హరీష్ రావుతోపాటు ఎంపీలు జితేందర్రెడ్డి, వినోద్, కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామంచంద్ర తేజావత్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అంతకు ముందు కేంద్రమంత్రి ఉమాభారతితో రాష్ట్ర మంత్రి హరీష్రావు సమావేశమయ్యారు. కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి వ్రిందా సరూప్తో సమావేశమై మొక్కజొన్నకు సబ్సిడీ ఇవ్వడం, పౌరసరఫరాలకు సంబంధించిన మరిన్ని అంశాలపై చర్చించారు.