Harish Rao: నల్గొండ బీఆర్ఎస్ కంచుకోట..ప్రతిపక్షాలు విషం చిమ్మితే..!
మిర్యాలగూడ: కేసీఆర్ పాలన బాగుంది కాబట్టే ఆయనకు రెండు సార్లు ప్రజలు అవకాశమిచ్చారని మూడో సారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు మంత్రి హరీష్ రావు. మిర్యాలగూడలో ఆయన ఆత్మీయ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఢిల్లీలో అవార్డులు ఎలా వస్తాయని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో నీళ్ల కోసం రోడ్లెక్కామని చెప్పిన మంత్రి హరీష్ రావు... బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా అందిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో లక్షా 52 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు మాటలు ఎక్కువ పనులు తక్కువ అని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీల అబద్దపు ప్రచారాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పాలనలో కాలిపోయిన మోటర్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లని మంత్రి హరీష్ రావు ఎద్దేవ చేశారు. మిర్యాలగూడలో ఎటుచూసినా అభివృద్ధి కనిపిస్తోందని చెప్పిన మంత్రి ... ఐటీ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని చెప్పారు. ప్రతిపక్షాలు విషం చిమ్మితే దాన్ని విషయ పరిజ్ఞానంతో తిప్పికొట్టాలని చెప్పారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోటని చెప్పిన మంత్రి హరీష్ రావు... మొన్న జరిగిన మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు.

మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని మరి అక్కడ ఇప్పటికీ కొన్ని ఊళ్లల్లో తాగునీటి సరఫరా లేదని గుర్తుచేశారు. అక్కడ వారానికోసారి తాగునీరు వస్తుందని చెప్పిన హరీష్ రావు, అక్కడ బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు.కాంగ్రెస్ పాలన బాగాలేదు కాబట్టే కేసీఆర్ను ప్రజలు గెలిపించుకుంటున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. అబద్ధాలను అభివృద్ధి అనే ఆయుధంతో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు.












Click it and Unblock the Notifications