జీవోలు తెలంగాణకిచ్చి.. ప్రాజెక్టులు మాత్రం ఆంధ్రాకిచ్చారు: హరీశ్రావు ఫైర్
హైదరాబాద్: గత పాలకుల కారణంగానే తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘తెలంగాణకు జీవోలు మాత్రమే ఇస్తాం.. ప్రాజెక్టులు కట్టం' అనేది గత పాలకుల విధానమని మంత్రి హరీష్రావు అన్నారు.
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కరవు ప్రాంతాలకు నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలిపారు.
తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో 299 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని చెప్పారు. ప్రస్తుతం 90 టీఎంసీలు కూడా వాడుకోవట్లేదని, కృష్ణాలో 344 టీఎంసీల నికర జలాలు మనకు రావాల్సి ఉందని తెలిపారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు డిండి, పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీరందిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని చెరువులన్నింటినీ ఐదేళ్లలో బాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని, అందుకనుగుణంగానే చెరువులను బాగు చేస్తామని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. కాకతీయుల స్ఫూర్తి కొనసాగించేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టామని వివరించారు. వారసత్వ సంపద కాపాడుకునేందుకే ఈ కార్యక్రమమని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయను ప్రవేశపెట్టామని, అందులో భాగంగానే చెరువుల పునరుద్ధరణ జరుగుతోందని తెలిపారు.

డిండి పాలమూరు ఎత్తిపోతల కోసం భూసేకరణ వేగంగా సాగుతోందని తెలిపారు. డిండి ప్రాజెక్టు భూసేకరణ కోసం రూ. 100 కోట్లు విడుదల చేశామని చెప్పారు. డిండి, పాలమూరు ఎత్తిపోతలకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో తెలంగాణ సుభిక్షంగా ఉండేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో చెరువులను కబ్జా చేసి నాశనం చేశారని మండిపడ్డారు. చెరువుల మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వలసలు పెరిగాయని అన్నారు. గత పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
టెండర్లు పిలిచి దోచుకుపోయారే తప్ప.. చెరువులను నింపాలని ఆలోచించలేదని మండిపడ్డారు. తెలంగాణలో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications