ఇబ్బంది పెట్టకండి, మాఫీ చేసి కొత్తవి ఇవ్వండి: మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం సూచించారు. రైతుల రుణాల పైన ఆయన స్పందించారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీ చేసి కొత్త రుణాలివ్వాలన్నారు.
రైతుల నుంచి వడ్డీ వసూలు చేయవద్దని ఆదేశించారు. బ్యాంకర్లు ప్రభుత్వ గైడ్లైన్స్ను పాటించాలన్నారు. రైతులకు అసౌకర్యం కల్గించకుండా బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు.
పుష్కరాలపై జగదీశ్వర్ రెడ్డి
నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి వేరుగా తెలిపారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 45 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గోదావరి పుష్కరాలు నిర్వహించిన అనుభవంతో మరింత విజయవంతంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పీఏపల్లి, చందంపేట సహా మారుమూల మండలాల్లోనూ ఘాట్లు నిర్మిస్తామన్నారు.
కృష్ణా నది లోతుగా ప్రవహిస్తుంది కాబట్టి అనువైన ప్రదేశాల్లోనే ఘాట్లు నిర్మిస్తున్నామన్నారు. పుష్కరాల్లో తాగునీటితో పాటు శానిటేషన్ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో చారిత్రక ఆలయాలు ఉన్న చోట శాశ్వత నిర్మాణాలు చేపడుతామన్నారు.