సోయి లేదు, పిచ్చి ప్రేలాపనలు: డిగ్గీపై హరీష్, పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దిగ్విజయ్ సోయి లేకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ అవినీతి పాలనను చూసి ప్రజలు చిత్తుచిత్తుగా ఆయనను ఓడించారని తెలిపారు.
గాంధీ కుటుంబ పాలన కింద ఉన్న దిగ్విజయ్ తెలంగాణలో కుటుంబ పాలన ఉందనడం సిగ్గుచేటు అని అన్నారు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని చెప్పారు.
రాష్ట్ర ప్రజలు ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెబుతున్నా కాంగ్రెస్కు సోయి రావడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కాంగ్రెస్కు కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని విమర్సించారు.
కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులన్నింటినీ వివాదాల్లో ఇరికించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. పేదలకు రూ. 1000 పెన్షన్ ఇవ్వడం దుబారానా? షాదీ ముబారక్ అమలు చేయడం దుబారానా? అని మంత్రి ప్రశ్నించారు.
ఇదిలావుంటే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై హైదరాబాదులోని బేగంబజార్ పోలీసులకు తెలంగాణ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి తెలంగాణలో కుటుంబ పాలన ఉందన్న దిగ్విజయ్తో పాటు ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో లాయర్లు విన్నవించారు.