వార్డు మెంబర్గా కూడా లేని నిన్ను ఈ స్థాయికి-మోదీతో ఏం డీల్ కుదిరింది-ఈటలపై ఓ రేంజ్లో హరీష్..
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వార్డుమెంబర్గా కూడా లేని ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేను, మంత్రిని చేస్తే... ఈ రోజు కేసీఆర్నే నీతి, జాతి లేదని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వామపక్ష వాదినని చెప్పుకునే నీకు, నీవు చేరిన బీజేపీకి ఏ నీతి, జాతి ఉందని ఈటలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈటల ప్రతీసారి మైకులు పట్టుకొని ఆత్మగౌరవం అంటూ తన బాధను అందరిపై రుద్దుతున్నాడని విమర్శించారు. హుజురాబాద్ ప్రజల బాధలు తిరాలన్నా, అభివృద్ధి జరగలన్నా గెల్లు శ్రీనివాస్నే గెలిపించాలన్నారు.శుక్రవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని భీం పల్లి గ్రామంలో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు.
'నీకు కనీసం వార్డు మెంబర్ పదవి కూడా లేనపుడు నిన్ను పెంచి పెద్ద చేసి ఎమ్మెల్యేను చేసి, మంత్రిని చేస్తే గోరి కడతా అని మాట్లాడుతున్నావు. శాలపల్లిలో ఈటల నా కుడి భుజం అని కేసీఆర్ అంటే.. ఇప్పుడు నువ్వు ఆయనకు గోరి కడతావా? నువ్వు చేరిన బీజేపీ పార్టీకి నీతి ఉందా? నువ్వు కదా బీజేపీ పార్టీని తిట్టింది...? నువ్వు కదా రైతులకు నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ అని, రైతులకు అన్యాయం చేస్తుంది బీజేపీ అని మాట్లాడినది. నీకు, కేంద్రంలో మోదీకి మధ్య ఏం డీల్ కుదిరింది? నువ్వు పుట్టుకతోనే వామపక్ష వాదిని అని చెప్పుకున్నావ్. మరి లెఫ్ట్ పార్టీల వాడివి బీజేపీలో ఎందుకు చేరావ్.. నీకు, నీ బీజేపీకి నీతి లేదు. నీకు పదవి కావాలి, ఆస్తులు కావాలి.. అందుకే బీజేపీలో చేరావు.' అని ఈటలను హరీష్ దుయ్యబట్టారు.

'నీకు, నీ బీజేపీకి నిజంగా నీతి, జాతి ఏమైనా ఉంటే రైతులకు నల్ల చట్టాలు తీసుకువస్తారా...? హుజురాబాద్లో ఓట్లు అడిగే ముందు ప్రజలకు నువ్వు ఒకటి చెప్పాలి. రైతుల నల్ల చట్టాల సంగతేంటి, గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతున్నారు? పేద ప్రజలను మరింత పేదవారిని చేసేలా విధానాలను అవలంభిస్తున్న మీరు, మీ పార్టీ నేతలు కేసీఆర్ను విమర్శించడం విడ్డూరం. నిత్యం రైతులు, ప్రజల సంక్షేమ కోసం పాటుపడుతున్న కేసీఆర్కు నీతి లేదు, జాతి లేదు అని మాట్లాడుతావా..' అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆనాడు చావనైనా చస్తా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కేసీఆర్ నిరాహారదీక్ష చేస్తేనే ఈనాడు తెలంగాణ వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి పథకం అమలులో ఉందన్నారు. అవ్వ, అక్క, అన్నలు, రైతులు అందరూ కూడా సంతోషం గా ఉండడానికి కారణం కేసీఆర్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇన్ని విమర్శలు చేస్తున్న ఈటల రాజేందర్... నీకు పేద ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే నియోజకవర్గానికి 5000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తే ఒక్కటైనా ఎందుకు కట్టలేదు.' అని ఈటలను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
Recommended Video
ఇదే సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ... 2001 నుంచి 2021 వరకు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారని అన్నారు.సీఎం కేసీఆర్ నిలబెట్టినవారే ఇప్పుడు కూడా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈటల కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు.తప్పులు కప్పి పుచ్చుకునేందుకు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారి బీజేపీలో చేరితే ఆత్మగౌరవం అని చెప్పుకునే ఈటల... ఇతరులు టీఆర్ఎస్లో చేరితే మాత్రం బానిసలని విమర్శించడం సరికాదన్నారు. సానుభూతి కోసం ఇతర బీజేపీ నాయకుల మాదిరి ఈటల కూడా తనపై దాడి చేయించుకుని కొత్త డ్రామాకు తెరలేపే కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications