ఈ ఆనందంలోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుంది: హరీశ్ భావోద్వేగం, ఆసక్తికర వ్యాఖ్యలు
సిద్దిపేట: తెలంగాణపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారని.. కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.
టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా?
నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలు తిరగబడితే, కేసీఆర్ దీక్ష చేయడం వల్లే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు నాడు కాంగ్రెస్ అంగీకారం తెలిపిందని హరీశ్ రావు చెప్పారు. టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేవారా? ఈ ప్రశ్నకు ఆజాద్ సమాధానం చెప్పాలి? అంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి హోదా ఇస్తే..
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు పరిశ్రమలు రావన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనని విమర్శించారు హరీష్ రావు. దత్తత గ్రామం ఇబ్రహీంపూర్లో హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. అశ్వవాహనంపై ఊరేగించారు.
హరీశ్కు నీరాజనాలు
గొల్ల కూర్మల డోలు డబ్బులు, మహిళలు మంగళ హారతులతో నీరాజనాలు పలికారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కట్టబెడుతుందని తెలిపారు. గులాం నబీ ఆజాద్ తెలంగాణకు వచ్చి చిలుక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే... వందలాది మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఢిల్లీ దిగివచ్చి తెలంగాణపై ప్రకటన చేసిందని హరీష్ తెలిపారు. తెలంగాణ ప్రజలు పోరాడి ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రం సాధించుకున్నారని తెలిపారు.
హరీశ్ భావోద్వేగం
ఇబ్రహీంపూర్ ప్రజల ఆధరాభిమానాలు, ప్రేమ వెలకట్టలేనివని హరీష్ రావు తెలిపారు. అంతేగాక, మీ అభిమానం ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందని హరీశ్ రావు భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తానని హరీశ్ రావు అన్నారు.
హరీశ్కే మా ఓటు
మీరంతా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని హరీశ్ రావు అక్కడి ప్రజలతో అన్నారు. ఓ వైపు వర్షం పడుతున్నా భారీ ఎత్తున సోదరీమణులు తనకు స్వాగతం పలకడంపై ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు హరీశ్ రావు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా తామంతా హరీశ్ రావుకే ఓటేస్తామని ఇబ్రహీంపూర్ ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేయడం గమనార్హం.