సిద్దిపేటలో ‘సద్దిమూట’: రూ. 5కే భోజనం
మెదక్: రైతులకు రూ. 5కే నాణ్యమైన భోజనం అందించే సద్దిమూట పథకాన్ని మెదక్ జిల్లాలోని సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్రంలో 150 మార్కెట్ యార్డులుండగా మొదటగా సిద్ధిపేట యార్డులో ఈ పథకానికి శ్రీకారం చుట్టామని, దశలవారీగా అన్ని యార్డుల్లో పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఏరియా మాతాశిశు సంరక్షణా దవాఖానాలోనూ భోజనామృతం పథకాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఎంఈఐఎల్ కంపెనీ, హరే రామ.. హరే కృష్ణ ట్రస్ట్ సహకారంతో ఈ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. రైతులకు రూ. 5కే భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో రైతు రూ. 5 చెల్లించగా, మార్కెట్ కమిటీ రూ. 5, మిగిలిన ఖర్చులను ఎంఈఐఎల్ కంపెనీ, హరే రామ.. హరే కృష్ణ ట్రస్ట్ భరించనున్నదని చెప్పారు.
దవాఖానాల్లో అందించే భోజనామృతం రోగులకు, సహాయకులకు ఉచితంగా అందించనున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ యార్డులలో కూడా దాతల సహకారంతో సద్దిమూట పథకానికి శ్రీకారం చుడుతామన్నారు. ప్రతి మార్కెట్లో గిడ్డంగు స్థాయిని పెంచడానికి సర్వే చేపట్టామన్నారు.
ధాన్యానికి ధర లేనప్పుడు గోదాములో నిల్వ చేసుకునే వెసలుబాటును రైతుబంధు పథకం ద్వారా కల్పించామన్నారు. నిల్వ చేసుకున్న ధాన్యంపై 75శాతం వరకు సుమారు రూ.2లక్షల వరకు రుణం తీసుకోవచ్చని, దీనికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతుకు ప్రమాద బీమా పథకం కూడా వర్తింపజేస్తామని తెలిపారు.
అంతకుముందు పత్తి మార్కెట్ యార్డులో రూ. 12 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులతోపాటు దుబ్బాక మార్కెట్ కమిటీ ఆవరణలో, సిడిపివో, సబ్ రిజిస్ట్రార్ భవనాలు, స్టేడియం, దుకాణాల సముదాయం పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి లక్ష్మీభాయ్, జెసి శరత్, ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్ రవిరెడ్డి, హరే రామ హరే కృష్ణ ప్రతినిధి సత్యగౌరీచంద్రలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.