విషాదం: అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుంచి దూకి హెచ్సీఏ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. శేరిలింగంపల్లిలో నల్లగండ్లలోని హిమసాయి అపార్టుమెంట్కు వచ్చిన హర్షిత(21) అనే యువతి ఆ భవనంలోని 15వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
వెస్ట్ మారేడ్పల్లికి చెందిన హర్షిత నగరంలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ)లో సిస్టమ్స్ బయాలజీలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. అయితే, ఆమె ఈ అపార్ట్మెంటుకు ఎందుకు వచ్చింది? ఆత్మహత్యకు దారితీసిన కారణాలేంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అపార్ట్మెంట్కు వెళ్లినప్పుడు ఆమె గేటు వద్ద విజిటర్స్ బుక్లో రాసిన వివరాలను పోలీసులు అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లగా అక్కడ ఎవరూ ఉండటం లేదని, ప్రస్తుతం ఆ ప్లాట్ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని గుర్తించారు. దీంతో ఈ కేసు మిస్టరీ మారింది. అయితే, హర్షిత ఈ ఫ్లాట్కు ఆత్మహత్య చేసుకునేందుకే వచ్చిందా? లేక బంధవులు, స్నేహితులు ఎవరైనా ఈ అపార్ట్మెంట్లో ఉన్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
హర్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. మృతురాలి తల్తి ఆస్పత్రికి వచ్చారు. ఏం జరిగిందనే విషయంపై ఆమె తల్లిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమె అపార్ట్ మెంటులో ఎవరినైనా కలిసిందా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు అక్కడ ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటీవల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న యువతుల సంఖ్య నగరంలో పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.