గుణపాఠం కావాలనే... అయినా ఉదారంగానే...: రోహిత్ బృదంపై అసక్తికరమైన విషయాలు
హైదరాబాద్: వేముల రోహిత్, మిగతా నలుగురిపై తాము కాస్తా ఉదారంగానే వ్యవహరించామని, వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు) రిజిస్ట్రార్ (ఇంచార్జీ) ఎం. సుధాకర్ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్కు దారి తీసిన కారణాలపై, అంబేడ్కర్ విద్యార్థి సంఘం, ఎబివిపిల మధ్య జరిగిన తగాదా, సుశీల్ కుమార్పై దాడి అనంతర చర్యలు, తదితర విషయాలపై సుధాకర్ మంగళవారంనాడు హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
సుశీల్ కుమార్పై దాడి చేసిన ఐదుగురు విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి పంపించేయాలని ప్రాక్టోరియల్ బోర్డు సిఫార్సు చేసిందని, అయితే ఆ ఐదుగురి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కాస్తా ఉదారంగానే వ్యవహరించామని ఆయన చెప్పారు. పూర్తి స్థాయి సస్పెన్షన్ను రద్దు చేసి కేవలం హాస్టళ్లు, పరిపాలనా భవం ప్రవేశానికి, ఎన్నికల్లో పోటీ చేయడం వంటివాటిని మాత్రమే నిషేధించామని, వారు తరగతులకు హాజరై చదువుకు కొనసాగించేందుకు వీలు కల్పించామని చెప్పారు.
ఎప్పుడేం జరిగింది: వివాదం నుంచి రోహిత్ వేముల ఆత్మహత్య వరకు
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, మిగిలిన విద్యార్థులకు గుణపాఠం కావాలనే ఉద్దేశంతో విధిలేని స్థితిలోనే విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామని, విశ్వవిద్యాలయంలోని అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ అయిన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫార్సు మేరకే సస్పెన్షన్ ఎత్తివేశామని ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిది కూడా విశ్వవిద్యాలయం నిబంధనల మేరకే జరిగిందని ఆయన కోర్టుకు తెలిపారు.
విశ్వవిద్యాలయం తమపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దొంతు ప్రశాంత్, తదితర హిహెచ్డి విద్యార్థులను హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని యూనివర్శిటీ రిజిస్ట్రార్ను ఆదేశించింది. దీంతో సుధాకర్ కౌంటర్ దాఖలు చేశారు.
మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి.....
అంబేడ్కర్ విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఎస్ఆర్ఎస్ హాస్టల్లో ఉంటున్న సుశీల్ కుమార్ ఉన్న గదికి 30 మంది వరకు విద్యార్థులు వెళ్లినట్లు మాకు 2015 ఆగస్టు 4వ తేదీన సమాచారం వచ్చింది.
సుశీల్ కుమార్ను అతని గది నుంచి సైకిల్ షెడ్ వరకు తీసుకుని వచ్చి రాతపూర్వకంగా క్షమాపణలు తీసుకున్నారు. గది నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో పిటిషనర్లు అతనిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఒత్తిడిలో సుశీల్ కుమార్ క్షమాపణ చెప్పాడు.
విశ్వవిద్యాలయం భద్రతా సిబ్బంది తమ వాహనంలో సుశీల్ కుమార్ను ప్రధాన ద్వారం సమీపంలోని సెక్యూరిటీ పోస్టు వద్దకు తీసుకుని వచ్చారు. పిటిషనర్లు, ఇతరలు అక్కడకు వచ్చి ఫేస్బుక్ క్షమాణలను సుశీల్ కుమార్ అప్లోడ్ చేసేలా చేశారు. సుశీల్ కుమార్ తన క్షమాపణలను, శాంతిపూర్వకంగా, స్వచ్ఛందంగా చెప్పారన్న పిటిషనర్ల వాదనలను ఖండిస్తున్నాం. అసలు అంత మంది ఓ విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి బలవంతంగా బయటకు తీసుకుని రావడం ఎంత మాత్రం కూడా న్యాయబద్దం కాదు.
భౌతిక హింసే జరగలేదని అనుకున్నా కూడా...
అసలు భౌతిక హింసే జరగలేదని అనుకున్నా కూడా మొత్తం వ్యవహారం ప్రజాస్వామ్యబద్దంగా, శాంతీయుతంగా జరిగిందని పిటిషర్లు చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఘోర తప్పిదానికి పిటిషనర్లే కారణం. వారు తమ పాత్రను ఎంత మాత్రం కూడా తోసిపుచ్చలేరు.
సుశీల్ కుమార్ ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యల వల్ల తమకు ఇబ్బంది ఉందని భావిస్తే వారు విశ్వవిద్యాలయ అధికారలకు ఫిర్యాదులు చేయాల్సింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాల్సింది కాదు. సుశీల్ కుమార్ ఫోన్ కాల్కు స్పందిస్తూ పోలీసులు హాస్టల్కు చేరుకున్నారు. తర్వాత పిటిషనర్లపై అదే రోజు కేసు నమోదు చేశారు.
బిజెపి ఎమ్మెల్సీ కలిసిన మాట నిజమే...
బిజెపికి చెందిన ఎమ్మెల్సీ ఒకరు, సుశీల్ కుమార్ తల్లి, ఇతరు సమక్షంలో వైస్ చాన్సలర్ను కలిసి మాట వాస్తవమే. బాధ్యులైన విద్యార్థులపై చరయ్లు తీసుకోవాలని కోరిన మాట కూడా వాస్తవమే. ఎబివిపి ప్రధాన కార్యదర్శి చేసిన ఫిర్యాదుకు కౌంటర్గా ఎఎస్ఎ నేతలు కూడా ఫిర్యాదు చేసి సుశీల్ కుమార్ను సస్పెండ్ చేయాలన్నారు.
ఈ రెండు ఫిర్యాదులను కూడా విశ్వవిద్యాలయ విద్యార్థుల క్రమశిక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ప్రాక్టోరియల్ బోర్డుకు నివేదించాం. అలాగే పిటిషనర్లకు సైతం నోటీసులు జారీ చేసి బోర్డు ముందు హాజరు కావాలని కోరాం. వారి వాంగ్మూలాలు కూడా నమోదు చేశాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా సుశీల్ కుమార్ విచారణ హాజరు కాలేదు. అయినప్పటికీ బోర్డు తన విచారణ కొనసాగించి ఆగస్టు 12వ తేదీన నివేదిక ఇచ్చింది.
యూనివర్శిటీ వర్గాలకు ఫిర్యాదు చేయకుండా సుశీల్ కుమార్ గదికి వెళ్లి గొడవకు దిగిన పిటిషనర్లకు గట్టి హెచ్చరికలు చేయాలని బోర్డు తన మధ్యంతర నివేదికలో సిఫార్సు చేసింది. సుశీల్ కుమార్, ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు బోర్డు మరోసారి సమావేశమై ఆగస్టు 31వ తేదీన తుది నివేదికను సమర్పించింది. సుశీల్ కుమార్పై పిటిషర్లు భౌతికంగా దాడి చేశారని, అందువల్ల వారిని యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేయాలని బోర్డు సిఫార్సు చేసింది.
అందులో భాగంగానే సెప్టెంబర్ 8వ తేదీన పిటిషనర్లను విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేశాం. ఈ ఘటనలో వారు ఎక్కడ కూడా తమ పాత్రను తోసిపుచ్చలేదు. అయితే విద్యార్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు సస్పెన్షన్ ఎత్తేశాం.
ఉదారంగా వ్యవహరించాం....
తర్వాత ప్రాక్టోరియల్ బోర్డు నివేదికను వైస్ చాన్సలర్ ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పరిశీలించి, అందులో చేసిన సిఫార్సులతో ఏకీభవించింది. తన నివేదికను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంచింది. ప్రాక్టోరియల్ బోర్డు, సబ్ కమిటీల నివేదికను పరిశీలించిన కౌన్సిల్ విద్యార్థుల విద్య, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారి పట్ట ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది.