రోహిత్ సూసైడ్: ఇంఛార్జ్ వీసీ పైనా ఫైర్, 'కెసిఆర్ ఇల్లు ముట్టడిస్తాం' (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య వ్యవహారం ఆదివారం నాడు కొత్త మలుపు తిరిగింది. వైస్ ఛాన్సులర్ అప్పారావు నిరవధిక సెలవుపై వెల్లారు. వర్సిటీ భౌతికశాస్త్ర విభాగం ఆచార్యుడు విపిన్ శ్రీవాత్సవకు ఇంఛార్జి వీసీ బాధ్యతలు అప్పగించారు.
దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం ఆమరణ దీక్ష భగ్నం చేసి ఏడుగురు విద్యార్థుల్ని ఆస్పత్రికి తరలించడంతో ఆదివారం మరో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్షకు కూర్చుని ఉద్యమాన్ని కొనసాగించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జనవరి 26న జెండా వందనానికి వీసీ వస్తే అడ్డుకోవాలని విద్యార్థి జెఏసి నిర్ణయించుకుంది. దీంతో ఉపకులపతి అప్పారావు ఆదివారం నుంచి సెలవు తీసుకున్నట్లు ప్రకటించారు. వెంటనే సమావేశమైన జెఏసి నేతలు వీసీ రాజీనామా డిమాండ్ నుంచి వెనక్కి తగ్గబోమంటున్నారు.
అలాగే, ఇంఛార్జి వీసీగా విపిన్ శ్రీవాత్సవ నియమాకాన్నీ అంగీకరించబోమంటున్నారు. రూ.8 లక్షల నష్టపరిహారాన్ని అంగీకరించబోమని, డిమాండ్ల సాధనకు అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలోనూ ఉద్యమిస్తామని జెఏసినేత వెంకటేష్ చౌహాన్ వెల్లడించారు.
హెచ్సీయూ అధ్యాపకుల సంఘం మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... వీసీ సెలవుపై వెళ్లడం తగదన్నారు. 2008లో పీహెచ్డీ విద్యార్థి సెంథిల్ కుమార్ మృతికి కారణమైన శ్రీవాత్సవను ఇంచార్జి వీసీగా నియమించడాన్ని ఖండిస్తూ వర్సిటీ ఎస్సీ, ఎస్టీ ఫోరమ్ నిర్ణయం తీసుకుందన్నారు.
పాలకమండలి ఉపసంఘం ఛైర్మన్గా శ్రీవాత్సవ నిర్ణయం వల్లే రోహిత్ చనిపోయాడని ఆరోపించారు. కేరళలోని కాలికట్ విశ్వవిద్యాలయం నుంచి 30 మంది విద్యార్థులు, నలుగురు అధ్యాపకులు వచ్చి ఉద్యమానికి మద్దతు పలికారు. జెఏసి ఛలో హెచ్సియుకు ప్లాన్ చేస్తోంది.
ఛలో హెచ్సియు
రోహిత్ మృతికి న్యాయం జరగాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఐకాస నేతలు నేడు ‘చలో హెచ్సీయూ' పేరుతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు.
ఛలో హెచ్సియు
దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల నుంచి 10వేల మందికి పైగా హాజరవుతారని ఐకాస కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ తెలిపారు. రోహిత్ చిత్రాలతో రూపొందించిన టీషర్టులను వీరందరికీ పంపిణీ చేస్తామన్నారు. కాగా, సోమవారం ఐడీ కార్డులు ఉన్న వారినే హెచ్సియులోకి అనుమతిస్తున్నారు.
ఖర్గే
వేముల రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీయే కారణమని, ప్రధానమంత్రి మోడీ రోహిత్ను భరతమాత ముద్దుబిడ్డగా అభివర్ణించారని, సమయానుకూలంగా అందంగా, ఆకర్షణీయంగా మాట్లాడడం ఆయనకు బాగా తెలుసునని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు.
హెచ్సియు
పేదలు, దళితులకు ఏం చేస్తే అభివృద్ధి చెందుతారో ప్రధాని మోడీకి తెలియదని, రోహిత్ మృతిపై పార్లమెంటులో నిలదీస్తామని ఖర్గే అన్నారు.
హెచ్సియు
అంబేడ్కర్ భావజాలంతో వర్సిటీలోని ఏఎస్ఏ నేతలు సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్లను జాతి వ్యతిరేకులుగా అభివర్ణిస్తూ దత్తాత్రేయ లేఖ రాయడం తగదని ఖర్గే అన్నారు.
హెచ్సియు
విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులుంటే దళిత విద్యార్థులు ఎలా పైకొస్తారు? దళితులు బానిసలుగా సేవ చేయడానికే అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తున్నారని ఖర్గే అన్నారు.
హెచ్సియు
కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతిఇరానీ రాసిన లేఖలే అందుకు ఉదాహరణ అని, కేంద్రం కుట్రపూరితంగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీకి చెందిన వ్యక్తుల్ని వర్సిటీల్లో నియమిస్తోందని ఖర్గే మండిపడ్డారు.
హెచ్సియు
రోహిత్ కులం గురించి రాజకీయం చేస్తున్నారని, అతను ఓబీసీ అయినా విద్యార్థి కాకుండా పోడని, రోహిత్ మృతికి న్యాయం జరిగేవరకు ఐకాసకు మద్దతుగా ఉంటామని ఖర్గే చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ నేషనల్ కమిషనర్ మెంబర్ కమలమ్మ
వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ తల్లి రాధికను కలిసిన ఎస్సీ, ఎస్టీ నేషనల్ కమిషనర్ మెంబర్ కమలమ్మ.
హెచ్సియు
విద్యార్థులకు, వర్సిటీ యంత్రాంగానికి మధ్య దూరం పెరిగిందని, సున్నితమైన అంశాలు జఠిలమవడంతో సమస్యలు పెరుగుతున్నాయని, చలో హెచ్సీయూ ముగిసిన తర్వాత వర్సిటీ అధికారులతో సమావేశమై విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని, ఆందోళన చేసోన్న విద్యార్థులతోనూ మాట్లాడి పరిస్థితి చక్కదిద్దాల్సి ఉందని, సెంథిల్ కుమార్ మరణంతో నాకు సంబంధం లేదని సీఐడీ విచారణలో తేలిందని ఇంఛార్జ్ వీసీ శ్రీవాత్సవ చెప్పారు. కాగా, ఎన్ఎస్యుఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రోజి ఎం జాన్.. రోహిత్ తల్లి రాధికను కలిసిన దృశ్యం.
రోహిత్ చనిపోయి వారం గడుస్తోన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించలేదని ఐకాస కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ అన్నారు. అదే వైఖరి కొనసాగిస్తే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. తెరాస, టిడిపిలు పార్టీపరంగా రోహిత్ మృతిపై వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కాగా, రోహిత్ మరణంతో తీవ్ర ఆవేదనలో ఉన్న తల్లి రాధిక ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఐకాస నేతలు ఆమెను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి ఛాతీ నొప్పి ఎక్కువగా ఉందని తేల్చారు. చికిత్స నిమిత్తం ఆమెను ఐసీయూలో ఉంచారు.