టీ కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన ట్రంప్ కార్డ్..! అప్పుడు వ్యతిరేకించిన గళాలే ప్రోత్సహిస్తున్నాయి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడి నోరు వెంట అతని పేరే వినిపిస్తోంది. ఏ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నేతలు తారసపడినా అతని గురించే చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా తమను కలిసిన పాత్రికేయులతో "మేం చెప్పేది ఆఫ్ ది రికార్డ్.. మనసులో పెట్టుకోండి కాని పేపర్ మీద పెట్టకండి" అంటూ ఆ నాయకుడి గురించి కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొస్తున్నారు. మొన్న కాంగ్రెస్ సభాపక్ష నేత జానా రెడ్డి స్పందిస్తూ 'అదికార పార్టీ విధానాల గురించి మేం చెప్పాలనుకున్నదే ఆయన చెప్తున్నాడు, తప్పేముంది' అని చాలా పాసిటీవ్ గా స్పందించారు. నిన్న మరో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాట్లడుతూ 'పార్టీలో ఆయనకు ఉన్నంత ప్రత్యేక ఇంటెలీజెంట్ వ్యవస్థ గాని, మేనేజ్ మెంట్ స్కిల్స్ గాని ఎవరికీ లేవు.. ఆ నాయకుడిని సవ్యంగా ఉపయోగించుకుంటే పార్టీకి పెద్ద ఎస్సెట్ అవుతుందని' తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇక ఎవరిగురించి పెద్దగా స్పందించని డీకె అరుణ కూడా 'ఆ నాయకుడు మంచి క్రౌడ్ పుల్లర్.. పార్టీలో సమూల మార్పులు ఆయనతో సాద్యమనే' అబిప్రాయాన్ని బహాటంగా వ్యక్తం చేసారు. ఇంతకి టీ కాంగ్రెస్ పార్టీలో ట్రంప్ కార్డ్ గా మారిన ఆ యువ నాయకుడు ఎవరు..? తెలుకునే ప్రయత్నం చేద్దాం..!!
టీ కాంగ్రెస్ లో సమూల మార్పులు..! పరస్పరం ప్రోత్సహించుకునే వాతారణం..!
టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సనాతన ఛాందస వాదానికి తెర పడుతున్నట్టు కనిపిస్తోంది. పరస్పర వైరుద్యం, ద్యేష పూరిత ధోరణిలకు నాయకులు స్వస్తి పలుకుతున్నట్టు తెలుస్తోంది. ప్రజాకర్షణతో ప్రజల్లో దూసుకుపోయి, పార్టీకి పూర్వవైభవం ఆపాదించే నాయకుడికి తమ సహకారాన్ని అందించే స్పూర్తి వంతమైన దిశగా నాయకుల దోరణి మారుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే మొన్నటి, నిన్నటి, నేటి తరం నేతలు ఆ నాయకుడి పోరాట పటిమకు నీరాజనాలు తెలుపుతున్నారు. ఆ నాయకుడు ముందుంటే పార్టీ పూర్వవైభవం ఖాయమనే భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి గురించి బహిరంగ ప్రకటనలు ఇవ్వకపోయినప్పటికి పార్టీలో అంతర్గతంగా మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ని తెలంగాణలో సరైన రీతిలో వినియోగించుకుంటే కాంగ్రెస్ పార్టీ అదికారం లోకి రావడం తథ్యమనే ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. అంతే కాకుండా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసించడం శుభ పరిణామమనే వాదన వినిపిస్తోంది.
రేవంత్ కి ప్రజాధరణ..! అంగీకరిస్తున్న డీకే అరుణ..!
ఇక ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ ఆ ఇద్దరు నేతలు ఆ జిల్లాలో ఏకమయ్యారు. ఉప్పు నిప్పు గా ఉన్న ఆ నేతలు అనుకోకుండా ఒకే పార్టీ గొడుగు కిందికి చేరారు. పరస్పర విరుద్ద భావాలు కలిగిన రేవంత్ రెడ్డి, డీకె అరుణ ఒకే పార్టీలో ఉంటే గ్రూపు తగాదాలకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రత్యర్థలు భావించారు. కానీ అందరి అంచనాలను పట పంచలు చేస్తూ జిల్లాలో ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. ప్రయివేట్ సంభాషణల్లో ఒకరి పై ఒకరికి ఉన్న అభిమానాన్ని , గౌరవాన్ని చాటుకుంటున్నారు. దీంతో వారి మద్య ఉన్న విబేదాలను ఆసరాగా చేసుకుని రాజకీయ పబ్బం గడుపుకుందామని భావించిన కొంతమందికి రేవంత్ రెడ్డి, డీకే అరుణ అంశం మింగుడు పడని వ్యవహారంలా పరిణమించింది.
టీ కాంగ్రెస్ లో వర్గ పోరుకు చెక్..!పూర్వవైభవం కోసం నేతల మద్య ఏకాభిప్రాయం..!
ఈ మధ్య రేవంత్ రెడ్డి కొందరి ముందు మాట్లాడుతూ అరుణమ్మ చాలా సీనియర్, దాంతో పాటు కేసీఆర్ పై నిజాయితీగా ఫైట్ చేస్తున్న కొద్దిమాంది లీడర్స్ లో ఆమె ముందు వరుసలో ఉంటారు. అలాంటి వాళ్ళు పీసీసీ అధ్యక్షులుగా ఉంటే తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు, గాంధీభవన్ కు పరిమితం కాకుండా ప్రజల్లో తిరిగి పార్టీని బలోపేతం చేయవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మరోపక్క డీకే అరుణ కూడా కొందరు పాత్రికేయులతో మాట్లాడుతు రేవంత్ కు పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకోస్తామని, ఇప్పటికైనా తామిద్దరు కలిసి మహబూబ్ నగర్ లో 10 స్థానాలు గెలిపిస్తామనే ధీమాను వ్యక్తం చేసారు. రేవంత్ క్రౌడ్ పుల్లర్ అని, పార్టీలో ఏ పదవి కట్టబెట్టినా ఇబ్బంది లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి, డీకే మద్య విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ లోని మరో వర్గానికి ఈ పరిణామాలు చెక్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఆ జిల్లాలో ఆ నేతలు ఒక్కటే..! ప్రత్యర్థులకు ఇక చుక్కలే..!!
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని మార్పులతో పాటు, స్పూర్తిదాయక వాతావరణం చోటుచేసుకుంటుంది. ఎన్నికల ముందు ఇలాంటి ప్రోత్సాహకర వాతావరణం పార్టీలో జోష్ నింపడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతన్నాయి. గ్రూపు తగాదాలకు నిలయంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎంట్రీ నూతన మార్పులను తీసుకొచ్చిందని, కార్యకర్తల మద్యే కాకుండా నేతల మద్య కూడా రేవంత్ రెడ్డి ఏకాభిప్రాయం తీసుకురాగలిగాడనే చర్చ జరుగుతోంది. పార్టీ పరంగా రేవంత్ రెడ్డికి గుర్తింపునిచ్చి ప్రజల్లోకి పంపిస్తే పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విజయాన్ని అందుకోవచ్చనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మరి రేవంత్ రెడ్డికి ఎలాంటి పదవి కట్టబెట్టి, ప్రజాక్షత్రంలో ఎప్పటినుండి దూకమని అదిష్టానం ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.