వామ్మో ఏం ఎండలు... మళ్లీ మూడు రోజులు వడగాల్పులు..
Recommended Video
భానుడు భగభగ మండుతున్నాడు. నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఉదయం ఏడింటి నుంచే సూర్యుడు తన ఉగ్రరూపం చూపిస్తుండటంతో చెమట, ఉక్కపోతతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. 10దాటిందంటే బయట అడుగుపెట్టలేని పరిస్థితి.

పిట్టల్లా రాలుతున్న జనం
తెలంగాణవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 47 డిగ్రీలు దాటేశాయి. మంగళవారం ఒక్కరోజే వడదెబ్బకు 55మంది పిట్టలా రాలిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18మంది, నల్గొండలో 10, ఖమ్మంలో 13, వరంగల్లో 14 మంది మృతి చెందారు. జగిత్యాల జిల్లాలో మూడ్రోజులుగా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అక్కడ ఏకంగా 47.9డిగ్రీలకు చేరింది.

మూడ్రోజులు తీవ్ర వడగాడ్పులు
రానున్న మూడు రోజులు ఎండలు మరింత మండిపోతాయాని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం నుంచి తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పింది. మధ్య మహారాష్ట్ర నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు కర్నాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్లు అధికారులు చెప్పారు.

ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల మరో మూడు రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. రాయలసీమ నుంచి కొమరిన్ వరకు తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మూడు రోజులు, రాయలసీమలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశముంది ఐఎండీ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications