రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల భారీ భద్రత: తెలంగాణాలో మారిన పొలిటికల్ సీన్!!
తెలంగాణా రాష్ట్రంలో తాజా ఎన్నికలతో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. తెలంగాణా రాష్ట్ర ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అని ఢంకా బజాయించి చెప్పటంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఇక రేవంత్ రెడ్డికి భద్రత పెంచిన పరిణామం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద సుమారు 30 మంది పోలీసులు మొహరించి భారీ భద్రతను కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ ఉంది. అయినప్పటికీ ఆయన భద్రతను ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత నాలుగింతలు పెంచారు. నిన్న సాయంత్రానికి ఉన్న భద్రత నిన్న రాత్రికి మరింత పెరిగినట్టు సమాచారం.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది అని, రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి ఇంటికి కార్యక్తలు దండు కట్టారు. ఈ క్రమంలో ఇంటిలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు రేవంత్ రెడ్డికి మరింత భద్రత పెంచినట్టు తెలుస్తోంది.
కాగా తెలంగాణా రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో అహర్నిశలు కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసిన నేతలకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పిన ఆయన ఎవరి శ్రమ వృధా కాలేదన్నారు. గడచిన 10 సంవత్సరాలుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు కొనసాగాయని, కేసులకు భయపడకుండా ఎంతో మంది పోరాటం చేశారన్నారు.
ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను కొనియాడారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. అయితే కౌంటింగ్ పూర్తయ్యి ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం ఏమరపాటు లేకుండా అందరూ జాగ్రత్తగా కౌంటింగ్ గమనించాలని తెలిపారు.












Click it and Unblock the Notifications