అకాలవర్షంతో రైతన్నల విలవిల: ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో తడిసిన ధాన్యం; కన్నీరుమున్నీరుగా అన్నదాతలు
ఆరుగాలం కష్టించి పంటలు పండించిన అన్నదాతలు ఒక్కసారిగా కురిసిన అకాలవర్షం దెబ్బకు విలవిలలాడుతున్నారు. పంట చేతికి వచ్చిన సమయానికి కురిసిన వర్షం దెబ్బకు రైతన్నలు లబోదిబోమంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో కురిసిన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దెబ్బకి అన్నదాతలు దిక్కుతోచని దయనీయ స్థితిలో పడ్డారు.
అకాల వర్షం రాష్ట్రంలోని రైతులను తీవ్రంగా నష్ట పరిచింది. బుధవారం నాడు కురిసిన వర్షం రైతులను నట్టేట ముంచింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం కూడా వర్షానికి తడిసి ముద్దవటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు కోతలు కోసి, వడ్ల కుప్పలు పోసి కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయాల కోసం నిరీక్షిస్తున్నారు. మరికొంత మంది రైతుల పంట కోతులకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో కురిసిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
తెలంగాణ రాష్ట్రం గత నెల 15 వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను ప్రారంభించింది. అయితే కొనుగోలు కేంద్రాలలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరగడంలేదని అటు రైతులు, ప్రధాన ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇక ఇదే సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసిన వరిధాన్యం తాజాగా కురిసిన భారీ వర్షానికి తడిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కొనుగోలు కేంద్రాల వద్ద కుప్ప పోసిన వారి ధాన్యం తడిసింది. కొన్నిచోట్ల ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. వర్షం వస్తే వరిధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు కూడా లేకపోవడంతో ధాన్యం తడిసి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతోనే రైతులు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ మండిపడుతున్నారు.
ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. తడిసిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరోపైపు వరి పంట మాత్రమే కాదు మామిడి, బత్తాయి, నిమ్మ పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.