వర్ష బీభత్సం: కూలిన చలివాగు బ్రిడ్జి; 9 గ్రామాలకు రాకపోకలు బంద్!!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు గ్రామాలకు గ్రామాలనే ముంచెత్తుతున్నాయి. వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకోగా.. గ్రామస్తులను రక్షించేందుకు ప్రభుత్వం ఆర్మీ హెలీకాప్టర్లను, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది.
గణపురం గణపసముంద్రం నిండుకుండను తలపిస్తూ మత్తడి పోస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పరకాల చలి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. టేకుమట్ల రాఘవ రెడ్డి పేట గ్రామాల మధ్య చలివాగుపై నిర్మించిన వంతెన కూలిపోయింది. అలాగే మూడో నంబర్ పిల్లర్ సైతం వంగి ప్రమాదకరంగా మారింది.

దీంతో చలి వాగు అవతల గ్రామాలైన రాఘవ రెడ్డి పేట, ఆరెపల్లి , వెల్లంపల్లి, గుమ్మడవెల్లి , బండపల్లి , కుందనపల్లి , ఎంపేడు , దుబ్యాల, మందరోనిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిలో గల చలి వాగు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చలి వాగు ప్రవహించే ప్రాంతమైన కనపర్తి , నాగూర్ల పల్లి గ్రామాలలో పంటలు పూర్తిగా మునిగిపోయాయి.
ఇదిలా ఉంటే హనుమకొండ ఛత్తీస్గడ్ ప్రధాని రహదారిలో కటాక్షపూర్ చెరువు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. గోవిందరావుపేట మండలంలోని దయ్యాలవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గోవిందరావుపేట దళిత కాలనీ పస్రాలోని ఎస్సీ కాలనీ, పాత నాగారం,సుప్రసిద్ధ మేడారం చుట్టూ వరదనీరుతో జల వలయంగా మారింది.
వర్ష బీభత్సం: కూలిన చలివాగు బ్రిడ్జి; 9 గ్రామాలకు రాకపోకలు బంద్..!! pic.twitter.com/24Z3KQOmd3
— oneindiatelugu (@oneindiatelugu) July 27, 2023
హనుమకొండ, ఏటూరునాగారం ప్రధాన రహదారులు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. వరంగల్ నగరంలోని హనుమకొండ కాజీపేట వరంగల్ ట్రైసిటీలు వర్షపు నీటిలో తేలినట్టుగా కనిపిస్తున్నాయి. ద్వీపంలా వరంగల్ నగరం మారింది. కరీంనగర్ హనుమకొండ ప్రధాన రహదారిలోని నయీం నగర్ నాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి .వందలాది కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి జిల్లాలోని ఆకేరు, మున్నేరు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.












Click it and Unblock the Notifications