తెలంగాణా, ఏపీలలో భారీ వర్షాలు; తెలంగాణాలో 7జిల్లాల్లో రెడ్ అలెర్ట్, హైదరాబాద్లో ఆరెంజ్ అలెర్ట్!!
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు, అనేక జిల్లాలలో మరోసారి వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒడిశా-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రస్తుత పరిస్థితి నెలకొందని, ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Recommended Video


అల్పపీడన ప్రభావం .. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో దక్షిణ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణాలో ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్
భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాత ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

హైదరబాద్ లో వర్షం .. రేపు కూడా కురిసే ఛాన్స్ ; నగరంలో ఎల్లో అలెర్ట్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురియగా, పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వరద నీటిమట్టాలను జీహెచ్ఎంసీ నిశితంగా పరిశీలిస్తోందని, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచామని అధికారులు తెలిపారు. నగరంలో ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో పాటు వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విపత్తు నిర్వహణ బృందాలను వరద ముంపు ప్రాంతాల్లో మోహరించారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, పంటలు.. జనజీవనం అస్తవ్యస్తం
కుమురం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి మరియు కొత్తగూడెం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు వర్షం కారణంగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పంటలు కూడా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో కురిసిన వర్షం కారణంగా రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నగరంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications