రూ. వేల కోట్లు స్వాహా: ఈమె మామూలు లేడీ కాదు! 3 రాష్ట్రాలను ’షేక్’ చేసింది
హైదరాబాద్: మనీ సర్క్యులేషన్ స్కీం పేరుతో సుమారు రూ. వెయ్యి కోట్లకుపైగా స్వాహా చేసిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీలో ఉన్న హీరా గ్రూప్స్ ఎండీ నౌహీరా షేక్ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు.
దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. హీరా గ్రూప్లో పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. హీరా గ్రూప్స్కు సంబంధించి పలు రాష్ట్రాల్లో 160 బ్యాంకు ఖాతాలున్నట్లు గుర్తించిన పోలీసులు.. వాటిలో నగదు నిల్వకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.
మోసం చేసిన నౌహీరా జైలుకు..
ఈ భారీ మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేక్ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఉన్న ఆమెను ఏసీపీ సీసీఎస్ రామ్ కుమార్ సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచిన అనంతరం హైదరాబాద్కు తరలించి మంగళవారం జైలుకు పంపించామని కొత్వాల్ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఢిల్లీలో అరెస్ట్..
బంజారాహిల్స్లో నివాసముంటున్న ఒక మహిళ తన వద్ద నుంచి కోటి రూపాయలు మదుపు చేయించుకున్న హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టుబడి, లాభం ఇవ్వకుండా మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని తెలంగాణ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టంలోని ప్రైజ్, చిట్స్, మనీ సర్క్యులేషన్ నిషేధం సెక్షన్ల ఆధారంగా దర్యాప్తు చేశారు. చట్టాలు ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించడంతో నౌహీరా షేక్ కదలికలపై నిఘా ఉంచారు. ఢిల్లీలో ఉందని తెలుసుకుని రెండ్రోజుల క్రితం వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు.
విదేశాల్లోనూ బాధితులు.. వందకుపైగా బ్యాంక్ ఖాతాలు
హీరాగ్రూప్ను ఆమె ఏడేళ్ల క్రితం ప్రారంభించిందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. వీరికి అమెరికా, మధ్యప్రాచ్య దేశాలు, దుబాయ్, సౌదీ అరేబియాతో పాటు తెలుగురాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సభ్యులున్నారని వివరించారు. వీరిలో 70శాతం మందికి పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా ఇవ్వలేదంటూ కొందరు బాధితులు ఆమెపై ఫిర్యాదు చేశారన్నారు. ఆమె డబ్బులు ఇవ్వలేదంటూ ఆంధ్రప్రదేశ్లో రెండు, బెంగుళూరులో ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. సీసీఎస్లో ఆరేళ్ల క్రితమే ఆమెపై ఓ కేసు నమోదయింది. ఆమె 15 కంపెనీలు స్థాపించారు, 160బ్యాంకు ఖాతాలున్నట్లు గుర్తించాం, అందులో రూ.వందల కోట్ల డిపాజిట్లున్నట్లు ప్రాథమికంగా అంచనాకొచ్చామన్నారు. ఆమె చేతిలో మోసపోయిన బాధితులు సీసీఎస్ అదనపు డీసీపీ జి.జోగయ్యకు వివరాలు చెప్పాలని సూచించారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి భారీగా ప్రచారం..
నౌహీరా షేక్ గతేడాది నవంబరులో మహిళా సాధికారత పార్టీ (ఆల్ ఇండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ-ఎంఈపీ)ని ఢిల్లీలోని ఓ 5నక్షత్రాల హోటల్లో ప్రారంభించారు. కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 224 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించి అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కర్ణాటక ఆదాయపు పన్ను ఆధికారులు మూడు నెలల క్రితం బంజారాహిల్స్లోని హీరా గ్రూప్ కంపెనీలో సోదాలు నిర్వహించడం గమనార్హం.
వందల కోట్ల ఆస్తులు..
హీరాగ్రూప్ ఆఫ్ కంపెనీస్కు రూ.వందల కోట్ల స్థిరాస్తులు సమకూర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలో రూ.100కోట్ల విలువైన భవనాలు, హైదరాబాద్ రూ.500కోట్ల బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, దుబాయ్లో రూ.400 కోట్ల విలువైన హోటళ్లు, క్లబ్హౌస్లున్నట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దేశ, విదేశాల్లో మొత్తం 43చోట్ల స్థిరాస్తులున్నాయని అంజనీ కుమార్ తెలిపారు. వేల కోట్ల మోసానికి పాల్పడిన ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దుబాయి, ఇరాన్, ఇరాక్ దేశాల్లోనూ హీరా గ్రూప్స్ వ్యాపారాలు నిర్వహించినందున ఎంత మేర వ్యాపారం నిర్వహించారనే విషయాలను తెలుసుకొనే పనిలో నిమగ్నమయ్యారు.