ల్యాండ్ మాఫియా మొదలైందా?: అరకు ఎంపీ గీత భర్త కిడ్నాప్.. విడుదల
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం బుధవారం కలకలం సృష్టించింది. తన భర్త పరుచూరి రామకోటేశ్వర రావును బుధవారం సాయంత్రం బలవంతంగా తీసుకెళ్లారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టడంతో ఆయన్ని కొండాపూర్ పరిధిలో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రాత్రి 12 గంటల సమయంలో రామకోటేశ్వర రావు ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అర్థరాత్రి ఇంటికి చేరుకున్న ఆయన్ని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు విచారించారు.
వివరాల్లోకి వెళితే ఎంపీ గీత కుటుంబానికి హైదరాబాదు గచ్చిబౌలిలో రూ. 75 కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమి ఉంది. రామకృష్ణ, సుధాకర్ రావు అనే ఇద్దరు వ్యక్తులకు ఎంపీ భర్త సదరు భూమిని డెవలప్ మెంట్కు ఇచ్చారు. అభివృద్ధి పేరిట భూమిని తీసుకున్న డెవలపర్లు ఎంతకీ పనులు చేపట్టక పోవడంతో భూమిని ఆయన తిరిగి దానిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చిన రామకోటేశ్వరరావును డెవలపర్లు మాట్లాడదాం రమ్మంటూ కారెక్కించుకుని తాజ్ కృష్ణ హోటల్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో భర్తకు గీత ఫోన్ చేస్తే అటునుంచి సమాధానం రాలేదు.
దీంతో ఆందోళనకు గురైన గీత కారు డ్రైవర్కు ఫోన్ చేయగా, అసలు విషయం తెలిసింది. దీంతో ఈ విషయాన్ని ఎంపీ గీత మీడియాకు తెలియజేసింది. అనంతరం ఆమె హైదరాబాదు పోలీసులు, తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రామకోటేశ్వరరావు నుంచి అర్ధరాత్రి గీతకు ఫోన్ వచ్చింది.
కిడ్నాపర్లు తనను కొండాపూర్ పరిధిలో వదిలేశారని ఆయన ఎంపీకి చెప్పారు. ఇదే విషయాన్ని సదరు తెలుగు న్యూస్ ఛానెల్ కు చెప్పిన గీత... భూమి విషయంలో నెలకొన్న వివాదమే తన భర్త కిడ్నాప్ నకు దారి తీసిందని చెప్పారు. మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన రామకృష్ణ, సుధాకర్ రావులు హోటల్లో తన భర్తను శారీరకంగానే చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు.
ఆ తర్వాత భూమి పత్రాలు లాక్కుని, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని వదిలేశారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి హస్తం ఉందని ఆమె ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై తన భర్త పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారని కూడా ఆమె పేర్కొన్నారు.