గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్, ఆ పిటిషన్ కొట్టివేత..
హైకోర్టు తాజా ఉత్తర్వులతో టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. టీఎస్పీఎస్సీ ఫలితాలను సవాల్ చేస్తూ శ్రీకాంత్ రెడ్డి అనే అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల వెల్లడి వాయిదా పడింది.
ఇటీవలే అతని పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఒక్క పోస్టును పక్కనపెట్టి నియామక ప్రక్రియ చేపట్టాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏ పోస్టును పక్కనపెట్టాలి?, ఏ తరహాలో ఆ ప్రక్రియ జరగాలి? అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఇంటర్వ్యూలు పూర్తయినప్పటికీ టీఎస్పీఎస్సీ ఫలితాలను వాయిదా వేస్తూ వచ్చింది.
తాజాగా న్యాయస్థానం శ్రీకాంత్ రెడ్డి పిటిషన్ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. మరోవైపు గ్రూప్-1కు సంబంధించి మరో రెండు పిటిషన్స్ విచారణలో ఉన్నాయి. హైకోర్టు తాజా ఉత్తర్వులతో టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఫలితాల వెల్లడికి మార్గాలను పరిశీలిస్తోంది.