తెలంగాణా సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హైకోర్టు నోటీసులు.. రీజన్ ఇదే!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఊహించని విధంగా హైకోర్టు నోటీసులు ఇవ్వటంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలినట్టు అయ్యింది. తెలంగాణా సీఎం కెసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి భూమిని కేటాయించిన వ్యవహారంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
టీఆర్ఎస్ కార్యాలయానికి భూకేటాయింపుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం
బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్ లో టీఆర్ఎస్ పార్టీకి కార్యాలయం కోసం భూమిని కేటాయించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి 4935 గజాల భూ కేటాయింపును సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర రాజ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇక హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ లోని భూమిని గజానికి కేవలం వంద రూపాయల చొప్పున కేటాయించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
హైదరాబాద్ తో పాటు జిల్లాలలోనూ పార్టీ కార్యాలయాల భూములపై కోర్టులో సవాల్
ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా మిగిలిన జిల్లాలలో కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు ఇదే తరహాలో భూమిని కేటాయించారని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఖరీదైన స్థలాలను అతితక్కువ రేటుకు పార్టీ కార్యాలయాలకు ఇస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్ళారు. జిల్లాలలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు కేటాయించిన భూములపై కూడా వారు కోర్టులో సవాల్ చేశారు.
సీఎం కేసీఆర్ కు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డికి నోటీసులు
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారంలో సిఎస్, సీసీఎల్ఏ, రెవెన్యూ సిఎస్, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అందులో ఆదేశించింది. మరి కోర్టు నోటీసులకు తెలంగాణా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో అన్నది తెలియాల్సి ఉంది.
ఖరీదైన భూములు పార్టీ ఆఫీసులకు కేటాయించటంపై ప్రతిపక్షాలు ఫైర్
ఇక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఖరీదైన భూమిని కేటాయించటంపై ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. తెలంగాణా ప్రజల సొత్తు దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇక ఈ నేపధ్యంలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి.