గ్రూప్ -2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : గ్రూపు-2 అభ్యర్థుల చిక్కుముళ్లు వీడిపోయాయి. ఎంపిక ప్రక్రియకు ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. బబ్లింగ్, వైట్నర్ వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది.
2016లో పరీక్ష ..
1032 గ్రూప్-2 ఉద్యోగాల కోసం 2016లో టీఎస్ పీఎస్సీ రాతపరీక్ష నిర్వహించింది. అయితే కొన్ని సెంటర్లలో బబ్లింగ్, వైట్ నర్ వాడటంతో వివాదం నెలకొంది. దీంతో బబ్లింగ్, వైట్ నర్ వాడినవారు, అర్హులైన ఇతర అభ్యర్థులు కేసు వేయడంతో దాదాపు నాలుగేళ్లపాటు హైకోర్టులో విచారణ కొనసాగింది. దీంతో నియామక ప్రక్రియకు జాప్యమేర్పడుతూ వస్తోంది. దీంతో సాంకేతిక కమిటీ వేయగా .. సిఫారసులు చేసింది. కమిటీ సిఫారసులను కొనసాగించాలని టీఎస్ పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్ నర్ వాడిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది.

కోర్టు కేసులతో ..
2016లో జరిగిన రాత పరీక్షకు 5 లక్షల మంది హాజరయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 3 వేల 147 మంది అభ్యర్థులను ఎంపికచేసింది. అయితే బబ్లింగ్, వైట్ నర్ వివాదం నేపథ్యంలో ఎంపిక ప్రక్రియ ఎప్పటికప్పుడు ఆగుతూ వస్తోంది. తాజాగా బబ్లింగ్, వైట్ నర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టంచేయడంతో నియామక ప్రక్రియకు టీఎస్ పీఎస్సీ సన్నద్ధమవుతుంది. మరోవైపు హైకోర్టు తీర్పును టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి స్వాగతించారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందని చెప్పారు. వేల మంది అభ్యర్థులకు ఊరట కలిగించే తీర్పు ఇదని .. త్వరలో మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టంచేశారు చక్రపాణి.












Click it and Unblock the Notifications