రావాల్సిందే: ప్రత్యూష సవతి తల్లికి హైకోర్టులో చుక్కెదురు
ప్రత్యూషను చిత్రహింసలకు గురిచేసిన ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామలకు హైకోర్టులో చుక్కెదురైంది.
హైదరాబాద్: ప్రత్యూషను చిత్రహింసలకు గురిచేసిన ఆమె సవతి తల్లి చిప్పా చాముండేశ్వరి అలియాస్ శ్యామలకు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిలు మంజూరులో ప్రతీవారం సంబంధిత కోర్టు ముందు హాజరు కావాలంటూ తాము విధించిన షరతును సడలించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఆదేశించినట్లుగానే కేసు విచారణ పూర్తయ్యేదాకా ప్రతీవారం కింది కోర్టు ముందు హాజరుకావాలని ఆమెకు తేల్చి చెప్పింది. బెయిలు షరతు సడలింపు నిమిత్తం ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, ఈ కేసులో చాముండేశ్వరిని 2015, జులై 9న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెకు చాలాసార్లు హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. అయితే, గత సంవత్సరం ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేస్తూ మంగళ, శుక్రవారాల్లో సంబంధిత కోర్టు ముందు హాజరుకావాలంటూ షరతు విధించింది.
ఆ తర్వాత ఈ షరతును సడలిస్తూ ప్రతీ మంగళవారం ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా 8వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, అనారోగ్య కారణాలతో బెయిల్ షరతును ఉపసంహరించాలని తాజాగా హైకోర్టును ఆశ్రయించింది చాముండేశ్వరి. అయితే, హైకోర్టు ఆమె దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది.
ప్రత్యూషను చాముండేశ్వరి చిత్రహింసలకు గురిచేసిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ప్రత్యూషను దత్తత తీసుకుని ఆమె బాధ్యత తనదేనని ప్రకటించారు.












Click it and Unblock the Notifications