తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. స్టే విధించి మల్లన్నసాగర్ నిర్వాసితుల భూసేకరణకు తాత్కాలిక బ్రేక్!!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ లో జీవో నంబర్ 35 పేర్కొనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది.
మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం చేస్తున్న భూసేకరణపై హైకోర్టు స్టే
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ముత్రాజ్ పల్లి, సంగపూర్ ప్రాంతాలలో చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయ సేన్ రెడ్డి స్టే విధించారు. మల్లన్న సాగర్ జలాశయం వల్ల నిర్వాసితులైన వారి కోసం పునరావాస కాలనీ నిర్మించేందుకు ప్రస్తుతం భూసేకరణ జరుగుతోంది. అయితే ముత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన చెరుకు శ్రీనివాసరెడ్డి గ్రామంలోని తన ఐదెకరాల భూమిని ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియలో భాగంగా తీసుకుంటున్న కారణంగా ఈ ప్రక్రియను ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులను బెదిరించి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వాదన
పిటిషనర్ తరఫు న్యాయవాది రాజశేఖర్ రెడ్డి వినిపించిన వాదనలో గ్రామంలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉందని అయినప్పటికీ ఇష్టంలేని రైతుల నుంచి 102 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించేందుకు ప్రయత్నించడం నిష్ప్రయోజనం అన్నారు. రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా ప్రజల నుండి భూములను లాక్కుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
అంతేకాదు గ్రామంలోని సర్వే నెంబర్ 326 లో రెండు వందల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తిస్తామని అధికారులు రైతులను బెదిరిస్తున్నారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇది రైతుల జీవితాలను దుర్భరం గా మారుస్తుందని వారికి పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు అధికారులు ఈ తరహా చర్యలకు దిగుతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
జీవో 35 పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పిటీషనర్ తరపు న్యాయవాది
ఇక ఇదే సమయంలో నోటిఫికేషన్ లో జీవో 35 పేర్కొనడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. సాగు నీటి ప్రాజెక్టులు, కాలువలు, స్పిల్ వే లాంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిపే భూసేకరణకు మాత్రమే వినియోగించాలని, కానీ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ సర్వే, గ్రామసభల ఆమోదం నుంచి తప్పించుకోవడం కోసం భూసేకరణలో ఈ జీవోను ఇచ్చిందని న్యాయవాది వాదించారు.
ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే విధించింది.
మల్లన్న సాగర్ నిర్వాసితుల భూసేకరణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్
కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దీని నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన ఎనిమిది గ్రామాల ప్రజలకు పునరావాసం కింద డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 102.13 ఎకరాలను సేకరించడానికి గత ఏడాది జనవరి 30వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో జీవో నెంబర్ 35 ను కూడా చేర్చి భూ సేకరణ మొదలుపెట్టింది. ఈ భూసేకరణను ముత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన రైతు కోర్టులో సవాల్ చేయడంతో ప్రభుత్వం భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్ పై తాత్కాలిక స్టే విధించింది.