ఈటల ఎపిసోడ్లో కేసీఆర్ సర్కార్కు షాక్... ఆ విచారణ చెల్లదన్న హైకోర్టు...ప్రభుత్వానికి కీలక ఆదేశాలు...
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై విచారణ జరుగుతున్న తీరును తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా విచారణ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ,విజిలెన్స్ అధికారులు సర్వే నిర్వహించిన తీరు సరిగా లేదని... కలెక్టర్ నివేదిక కూడా చట్ట ప్రకారం సక్రమ రీతిలో లేదని పేర్కొంది. ఇప్పటివరకూ జరిగిన విచారణ చెల్లదని... చట్ట ప్రకారం మళ్లీ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో జమున హేచరీస్ భూములు,వ్యాపారాల్లో జోక్యం తగదని స్పష్టం చేసింది.
చట్ట ప్రకారం వ్యవహరించండి.. : హైకోర్టు
చట్ట ప్రకారం.. విచారణకు ముందు జమున హేచరీస్ యాజమాన్యానికి ప్రభుత్వం నోటీసులు పంపించాలని హైకోర్టు ఆదేశించింది.నోటీసులపై స్పందించేందుకు తగినంత సమయం ఇవ్వాలని పేర్కొంది. అంతే గానీ హడావుడిగా నోటీసులు ఇచ్చి వెంటనే స్పందించమనడం సరికాదని తెలిపింది. సెక్షన్ 149,151 ప్రకారం అధికారులు విచారణకు వెళ్లినప్పుడు సదరు కంపెనీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉండాలని వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులు లేకుండానే కలెక్టర్ ఆ భూముల్లోకి వెళ్లారన్న ఈటల తరుపు న్యాయవాది వ్యాఖ్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఎవరైనా ఏ ఇంట్లోకైనా ప్రవేశించవచ్చునన్న సంకేతాలకు ఆస్కారం ఇచ్చినట్లయిందని తెలిపింది.
ఆ నివేదిక చెల్లదు : హైకోర్టు
మే నెల 1, 2 తేదీల్లో జరిగిన విచారణను, కలెక్టర్ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఆ విచారణ ప్రక్రియ సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా జరిగిందని పేర్కొంది. ఈటల భూముల్లో సర్వే చేయించడం,బలవంతంపు చర్యలు తగదని స్పష్టం చేసింది. ఈటల తరుపు న్యాయవాది మాట్లాడుతూ... ఇదంతా ప్రీప్లాన్డ్గా జరిగిందని కోర్టుకు తెలిపారు. మీడియాలో వచ్చిన కథనాలతో ఆగమేఘాల మీద అధికారులు ఆ భూముల్లోకి వెళ్లారని పేర్కొన్నారు. కలెక్టర్ కూడా 24 గంటల్లోనే ప్రభుత్వానికి నివేదిక అందించారని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండానే ఆ భూముల్లోకి వెళ్లారని.. ఇలా చేయమని ఏ చట్టం చెబుతుందో అధికారులు చెప్పాలని ప్రశ్నించారు.
కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం...
కలెక్టర్ ఇచ్చిన నివేదికలో ఈటల జమునా w/0 నితిన్ రెడ్డి అని రాసి ఉండటాన్ని ఈటల తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ వ్యవహరమని చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి స్పందిస్తూ... ఇదంతా చూస్తుంటే అధికారులు కారులో కూర్చొని నివేదిక తయారుచేసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇక ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. ఇప్పటివరకు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగిందన్నారు. తదుపరి చర్యలు చట్ట ప్రకారం ఉంటాయని కలెక్టర్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. ఇరువురి వాదనల అనంతరం ఇప్పటివరకూ జరిగిన వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.