బోనాలపై అధికారుల ఫోకస్ : రూ.7 కోట్లు, 3వేల మందితో భద్రత
హైదరాబాద్ : నగరం బోనాల శోభను సంతరించుకుంది. గోల్కొండ బోనంతో నేడు ఘనంగా ప్రారంభమైన బోనాలు నగరమంతటా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం కూడా ఖర్చుకు వెనుకాడడం లేదు. నగరంలో బోనాల నిర్వహణ కోసం రూ.7 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి.
కాగా, ఏర్పాట్లు, భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు బోనాల ఉత్సవాల నిర్వహణపై జరిగిన సమీక్షలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డితో పాటు, సీపీ మహేందర్రెడ్డి సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో భాగంగా.. బోనాల సందర్బంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు అధికారులు. బోనాల కోసమే ప్రత్యేకంగా 500మంది అదనపు పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారని, అలాగే భక్తుల సౌకర్యార్థం ఆరు మొబైల్ మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి.. శాంతియుత వాతావరణంలో బోనాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం నగరంలోని ఇతర శాఖలను కలుపుకుని పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తుందన్నారు.
భద్రతా ద్రుష్ట్యా.. నగరంలోని బోనాల ఊరేగింపు మార్గాల్లో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలిపారు. బోనాల్లో భాగంగా.. మహిళల రక్షణకు షీ టీమ్స్, గొలుసు దొంగతనాలు జరగకుండా ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. బోనాల కోసం మొత్తం 3వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.
అలాగే బోనాల సందర్బంగా.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను చూసి భయభ్రాంతులకు గురికావద్దని, వాటిని నమ్మవద్దని సూచించారు సీపీ మహేందర్ రెడ్డి.