హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం ... ప్రమాదానికి గురైన గవర్నర్ వాహనం
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది . హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళుతుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో ఆయన కారు అదుపు తప్పింది. జాతీయ రహదారిపై అదుపుతప్పిన గవర్నర్ దత్తాత్రేయ వాహనం రోడ్ కిందికి దూసుకెళ్లింది.
Recommended Video

ఈరోజు నల్గొండ పట్టణంలో ఉదయం 10.30 గంటలకు నల్గొండ పట్టణ ప్రజలచే బండారు దత్తాత్రేయ కు పౌర సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో ఆయన వాహనానికి ప్రమాదం జరిగింది.

ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ ఒక్కసారిగా బిగుసుకుపోవడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది . ఒక్కసారిగా స్టీరింగ్ బిగుసుకుపోయి ఆయన కారు రోడ్డు పక్కకు దూసుకు పోయినట్లుగా తెలుస్తుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రమాద సమయంలో కారులో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన డ్రైవర్ తో పాటు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరిన బండారు దత్తాత్రేయ ఈరోజు గండగోని మైసమ్మ కన్వెన్షన్ హాల్లో పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. మాజీ మంత్రిగా పనిచేసిన, తాజా గవర్నర్, తెలంగాణ రాష్ట్ర బిజెపి రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత అయిన బండారు దత్తాత్రేయ కు భారీ ప్రమాదం తప్పడంతో బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.












Click it and Unblock the Notifications