హోంగార్డ్స్ మెరుపు నిరసన, ఖైరతాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: తమను విధుల్లోకి తీసుకోవాలంటూ హోంగార్డులు సోమవారం నాడు ఉదయం ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఆందోళనకు దిగారు. ఒక్క హోంగార్డు హోర్డింగ్పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. దీంతో ఖైరతాబాద్ జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆర్డర్ కాపీలు లేవనే కారణాన్ని చూపుతూ సుమారు 350 మంది హోంగార్డులను ఉద్యోగాల నుండి తొలగించారు. యూనిపామ్ ఇచ్చి జీతాలిస్తూ గుర్తింపు కార్డులిచ్చి కూడ ఎందుకు ఉద్యోగాల నుండి తొలగించారని వారు ప్రశ్నిస్తున్నారు.
తొలగించిన హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినా అధికారులు స్పందించడం లేదని బాధిత హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబాలతో సహ హోగార్డులు మెరుపు ఆందోళనకు దిగారు. ఈ విషయమై తమకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హమీ ఇవ్వాలని కోరుతున్నారు. లేకపోతే ఇంటికి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు.మరో వైపు బాధిత హోంగార్డు ఒక్కరూ హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.