తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్: కంచ ఐలయ్య వర్సెస్ స్వామి పరిపూర్ణానంద..
శుక్రవారం రాత్రి ఓ టీవి చానెల్ నిర్వహించిన డిబేట్ లో ఐలయ్య, పరిపూర్ణానందస్వామిల మధ్య హాట్ డిబేట్ జరిగింది.
హైదరాబాద్: ప్రొఫెసర్ కంచె ఐలయ్య పుస్తకంపై వివాదం ఇంకా చల్లారలేదు. శుక్రవారం రాత్రి ఓ టీవి చానెల్ నిర్వహించిన డిబేట్ లో ఐలయ్య, పరిపూర్ణానందస్వామిల మధ్య హాట్ డిబేట్ జరిగింది.
అయితే చర్చలో స్వామి పరిపూర్ణానంద సంయమనం కోల్పోయి మాట్లాడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐలయ్య ప్రశ్నలకు పరిపూర్ణానంద మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పాలని ఐలయ్య అడిగిన ప్రశ్నకు ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అదొక అవమానంగా భావించి డిబేట్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు.
ఐలయ్య ఏమన్నారు?:
క్రైస్తవ మిషనరీల కోసం ప్రశ్నిస్తున్నారంటూ ఐలయ్యను పరిపూర్ణానంద ప్రశ్నించారు. తమ పిల్లలైన బహుజనులకు ఇంగ్లీష్ విద్యను బోధించడానికి ఎవరి సహాయమైనా తీసుకుంటామని ఐలయ్య బదులిచ్చారు. ఆ క్రమంలో వారు బైబిల్ చేతిలో పెడితే.. వాళ్లిచ్చే డబ్బులు తీసుకుని దాన్ని పక్కనపెడుతామని అన్నారు.
షెఫర్డ్ ఎందుకు?
నువ్వు క్రిస్టియన్ కాకపోతే పేరు చివర షెఫర్డ్ అని ఎందుకు పెట్టుకున్నావని పరిపూర్ణానంద ఐలయ్యను ప్రశ్నించారు. అది తన అస్తిత్వం అని.. తాను కుర్మ కుటుంబంలో పుట్టినందునా షెఫర్డ్(కాపరి) అని పెట్టుకున్నానని చెప్పారు. విదేశాల్లో ఈ సంస్కృతి ఎప్పటినుంచో ఉందన్నారు. అక్కడ కుండలు చేసేవాళ్లు పేరు చివర 'పాటర్' అని పెట్టుకుంటారని, హారీ పాటర్ కూడా అందుకు ఒక ఉదాహరణ అని ఐలయ్య సమాధానం చెప్పారు.
తల్లిదండ్రుల పేర్లు చెప్పండి?:
పరిపూర్ణానంద ప్రశ్నకు సమాధానం చెప్పిన ఐలయ్య.. నా ఐడెంటిటీ గురించి అడిగారు కాబట్టి మీ ఐడెంటిటీ గురించి కూడా చెప్పాలని అన్నారు. అందులో భాగంగా మీ తల్లిదండ్రులు పేర్లు, పూర్వం వాళ్లు చేసిన పనుల గురించి వివరించాలన్నారు. దీంతో స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యారు. పేరు అడగడం ద్వారా తన తల్లిని అవమానించారని, తన తల్లిదండ్రుల గురించి నీతో చెప్పాల్సిన పనిలేదని అన్నారు. అంతేకాదు! పలుమార్లు 'తల్లిదండ్రుల పేర్లు నీకెందుకయ్యా.. పిల్లనిస్తావా ఏమయ్యా ఐలయ్య' అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
హిందువులు ఐక్యం కాకపోతే తప్పుకుంటా:
లక్ష కోట్లు ఇస్తే ఏదైనా చేస్తానన్న కంచె ఐలయ్య లాంటి దేశద్రోహలను ప్రోత్సహించరాదని పరిపూర్ణానంద అన్నారు. దేవీనవరాత్రుల అనంతరం కీలక కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తనతో పాటు హిందువులు కలిసి రాకపోతే.. ధార్మిక జనజీవనస్రవంతి నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. దళితులను మతం మార్చి రిజర్వేషన్లకు దూరం చేస్తున్నారని పరిపూర్ణానంద స్వామి చెప్పారు.