రాహుల్ గాంధీ పర్యటనపై ఓయూ వేదికగా హాట్ పాలిటిక్స్.. నేడు కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనను సీరియస్ గా తీసుకున్న టిపిసిసి, రాహుల్ గాంధీ పర్యటన సక్సెస్ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడానికి, ఓయూలో పర్యటనకు అనుమతి నిరాకరించి అటు ప్రభుత్వం సైతం దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి.
రాహుల్ గాంధీ పర్యటన ... హాట్ పాలిటిక్స్
రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లో అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద ఆందోళన చేసిన ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ధ్వంసం చేశారు.
వీసీ వైఖరికి నిరసనగా గాజులు, చీరలు పెట్టి ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక మరోవైపు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ యూత్, ఎన్ఎస్యూఐ విద్యార్ధి విభాగం నేతలపై కేసులు .. 14 రోజులు రిమాండ్
ఇదే సమయంలో నాయకుల పరామర్శ కి వెళ్ళిన జగ్గారెడ్డి ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తో సహా 18 మంది నాయకులను 14 రోజుల రిమాండ్ కు చంచల్ గూడా జైలుకు తరలిస్తూ నాంపల్లి మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ తో సహా 18 మంది యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.
విద్యార్థి నాయకుల అరెస్టు దుర్మార్గం.. కేసీఆర్ దిష్టి బొమ్మల దహనాలకు పిలుపు
విద్యార్థి నాయకుల అరెస్టు దుర్మార్గం అంటూ మండిపడుతున్నారు. వెంకట్ తో పాటు విద్యార్థి నాయకుల అరెస్టు లను తీవ్రంగా ఖండించిన రేవంత్ రెడ్డి అరెస్టులకు నిరసనగా సోమవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా కెసిఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగనున్నాయి.
Recommended Video
రాహుల్ పర్యటనకు ముందు రాష్ట్రంలో రగడ
కెసిఆర్ పాశవిక చర్యలను ఖండిస్తూ ఉద్యమించాలన్న రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కెసిఆర్ దిష్టిబొమ్మల దహనాలు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. మరి ఈరోజు కెసిఆర్ దిష్టిబొమ్మల దహనాలను పోలీసులు అడ్డుకుంటారా? కాంగ్రెస్ పార్టీ నేతలపై మళ్లీ కేసులు పెట్టి, వారితో మైండ్ గేమ్ ఆడుతూ రాహుల్ గాంధీ పర్యటన సక్సెస్ కాకుండా అడ్డుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.