వినాయక ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు..! ఎన్నో విశేషాల గణేషుడు..!శాంతిభద్రతలకు ఢోకా లేదంటున్న పోలీసులు..!
Recommended Video
హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాలకు నగరం ముస్తాబవుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను చేస్తోంది. ప్రభుత్వ వర్గాలు కూడా చవితి వేడులకలను ప్రశాంతంగా నిర్వహించేందకు గణేష్ ఉత్సవ సమితికి సహకారం అందివ్వనుంది. అందులో భాగంగా గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ రెండు నుంచి పన్నెండు వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై శ్రీనివాస్యాదవ్ అధ్యక్షతన హోం మంత్రి మహమూద్అలీ, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్లు వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సచివాలయంలో సమీక్షించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో యాభై ఐదు వేలకు పైగా విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తలసాని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద తొమ్మిది రోజులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ద్వాదశాదిత్యుడు..! ఎన్నో ప్రత్యేకతల విఘ్నేషుడు..!!
ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది 61 అడుగు ల ఎత్తులో దర్శనమివ్వనుంది. మహాగణపతి చరిత్రలోనే ఇదే అత్యధికం. వాస్తవానికి మహాగణపతి 60 అడుగులకు చేరిన తర్వాత ప్రతిఏటా ఒక్క అడుగు చొప్పున ఎత్తుతగ్గిస్తున్న విషయం విదితమే. ఈసారి ద్వాదశాదిత్య రూపంలో భారీ గణపతిని తయారు చేయనున్న నేపథ్యంలో ఎత్తు 61అడుగులు ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు తుది నమూనాను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు విడుదల చేశారు. ఈ సారి అత్యంత ఆకర్శణీయంగా మహాగణపతిని రూపొందించినట్టు ఆయన తెలిపారు.
పేరులోనే ఎంతో విశిష్టత..! పురాణ నేపథ్యంతోనే నామకరణం..!!
సూర్యుడు మనకు 12 రూపాల్లో కిరణాలు అందిస్తాడు. అందుకే ద్వాదశాదిత్యుడని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ 12 రకాల కిరణాల చెడు ప్రభావం మానవాళిపై పడకుండా కాపాడేందుకు ద్వాదశాదిత్య మహాగణపతిగా నామకరణం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. సూర్యుడు కూడా మహాగణపతి అధీనంలో ఉన్నాడని చెబుతూ, ఈ సంవత్సరం అతివృష్టి, అనావృష్టి లేకుండా వర్షాలు కురవాలని, నవగ్రహ,రాహుకేతు, శనేశ్వరుడు, కుజ గ్రహాల దుష్ప్రభావాల నుంచి ప్రజలను మహాగణపతి కాపాడాలని విగ్రహాన్ని ఈ రూపంలో తయారు చేయాలని నిర్ణయించామని దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ చెప్పుకొస్తున్నారు.
పెరిగిన గణేషుడి ఎత్తు..! ఇవే ప్రత్యేకతలు..!!
వినాయకుడి ఎత్తు గతేడాది 56 అడుగులే ఉంది. ఈసారి వినాయకుడి తలపై మరొక తలను అదనంగా ఏర్పాటు చేయడం, దానిపై సూర్యభగవానుడి చక్రం, ఆపై 12 తలల పాములను ఏర్పాటు చేయడంతో గణపతి ఎత్తు 61 అడుగులకు చేరుకుంది. ద్వాదశాదిత్య మహాగణపతిగా పేరు నిర్దారించడమే కాకుండా, సూర్య భగవానుడి ఆకారంలో, రథంపై 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 50 టన్నుల బరువు, 12 ముఖాలు, 24 చేతులు, 12 సర్పాలను ఏర్పాటు చేసారు. ఇవి చూపరులను ఎంతగానో అలరించనున్నట్టు తెలుస్తోంది.
అశ్వాలతో ప్రత్యేక ఆకర్శణ..! తొమ్మిది రోజుల పాటు అలరించనున్న భారీ గణనాథుడు..!!
రథం లోపల కుడివైపున మహంకాళి, మహాసరస్వతి స్వరూపమైన సిద్ధకుంజికా దేవి 12 అడుగుల ఎత్తులో 3 ముఖాలు, 6 చేతులతో ఉంటుంది.రథం లోపల ఎడమవైపున బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయస్వామి 12 అడుగుల ఎత్తులో గోవుతో నిలబడి ఉంటారు. విగ్రహానికి కుడివైపు మహావిష్ణువుతో పాటు ఏకాదశి దేవి విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఉంటాయి. విగ్రహానికి ఎడమవైపు త్రిమూర్తులతో దుర్గాదేవి విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఉంటాయి. షెడ్డు ఎత్తు 65 అడుగులు, వెడల్పు 30 అడుగులు ఉంటుందని ఉత్సవ కమిటీ నాయకులు చెప్పుకొస్తున్నారు.