మేడారం జాతర .. ఇవాళ సమ్మక్క ఆగమనం : రెండు దశాబ్దాల తరువాత..!!
తెలంగాణ కుంభమేళా జన జాతరతో కళకళలాడుతోంది. రెండు దశాబ్దాల తర్వాత మేడారం జాతరలో అద్భుతం చోటు చేసుకుంది. గత రెండు దశాబ్దాలలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి. ప్రంపచంలోనే అతిపెద్ద ఆదివాసీ జన జాతర కు నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీల ఆచారాలతో నిండు పున్నమి వేళ బుధవారం రాత్రి 10.47 గంటలకు సారలమ్మ తల్లి గద్దెపై కొలువైంది. కన్నెపల్లి నుంచి అమ్మ ప్రతిరూపాలుగా భావించే, పసుపు-కుంకుమల భరిణలను మేడారంకు తీసుకొచ్చి గద్దెపైన ప్రతిష్ఠించారు పూజారులు.
Recommended Video
గద్దె పైకి సమ్మక్క
సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన కన్నెపల్లి ఆడపడుచులు.. అమ్మలను ప్రతిష్ఠించే గద్దె వద్ద శుద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక ఇవాళ చిలకల గుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకు వస్తారు పూజారులు. సమ్మక్క తల్లికి ప్రభుత్వ లాంఛనాలతో ఆహ్వానం పలుకుతారు అధికారులు, మంత్రులు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ సారి మరో ప్రత్యేకత చోటు చేసుకుంది. గత రెండు దశాబ్దాలలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
భారీగా భక్త జనం
బుధవారం రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే రోజే జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదని సమ్మక్క ఆలయ పూజారులు చెబుతున్నారు. తొలి రోజున అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని(బంగారం) కానుకగా సమర్పిస్తున్నారు. ఉదయం నుంచే గుడిసెలు ఏర్పాటు చేసి ముంగిళ్ల వద్ద రంగవల్లులతో అందంగా అలంకరించారు.
మొక్కులు తీర్చుకుంటూ
అమ్మవార్లకు బెల్లం చీరెసారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకొని తన్మయత్వానికి లోనవుతున్నారు. వనదేవతల దర్శనానికి భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 18న వన దేవతలను దర్శిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యే సీతక్కతో కలిసి దేవతల్ని దర్శించుకున్నారు. దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన శ్రీధర్బాబు... మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 19న మహాజాతరకు వస్తారని సీతక్క తెలిపారు.