ఓటెత్తిన హుజూరాబాద్ -86.33% పోలింగ్ నమోదు : భారీ పోలింగ్ ఎవరికి మేలు చేసేను..!!
రాజకీయంగా ఉత్కంఠ..ఆసక్తికి కారణమైన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచే ఓటెత్తారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో 82.19 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 86.33 శాతం పోలింగ్ స్థాయిలో జరిగింది. అధికార టీఆర్ఎస్...బీజేపీ తో పాటుగా కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఒక విధంగా ఈ ఉప ఎన్నికల టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మారింది. అంత కంటే కేసీఆర్ వర్సస్ ఈటల గా జరిగింది. అయితే, ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరగటంతో ఇది ఎవరికి మేలు చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.
భారీ పోలింగ్ తో ఎవరికి మేలు జరిగేను
ఎగ్జిట్ పోల్స్ అంచనా లు వచ్చినా...రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా చూస్తున్న విశ్లేషకులు మాత్రం దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, హుజూరాబాద్, కమలాపూర్లలో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం ప్రారంభమైంది. జమ్మికుంట మున్సిపాలిటీ, హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఉదయం 9 తరువాత పోలింగ్ ఊపందుకుంది. ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో 10.61 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పూట వృద్ధులు, వికలాంగులు ఎక్కువగా ఓట్లు వేసేందుకు వచ్చారు.
ఈటలకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్
చివరి గంటలో కరోనా పాజిటివ్ రోగులు ఓటేసేందుకు అనుమతించారు. సాయంత్రానికి 76.26 శాతానికి చేరుకున్న పోలింగ్ పర్సంటేజీ, చివరగా పోలింగ్ ముగిసేసరికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 86.33 శాతానికి చేరింది. రాత్రి ఏడు గంటల లోపు క్యూలో ఉన్నవారిని అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు. ఈవీఎంలన్నీ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో పలుచోట్ల చిన్నచిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి.
బీజేపీ నేతల ధీమా...
ఉదయం టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్రెడ్డి వీణవంక పోలింగ్ కేంద్రంలో పర్యటించిన సమయంలో బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. మరోవైపు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ఓటర్లకు డబ్బుల పంపిణీపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరస్పరం ఆరోపణలకు దిగారు. మరికొన్ని చోట్ల రెండుపార్టీల నేతలు బాహాబాహీకి దిగారు.ఈవీఎంలన్నీ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలకు తరలించి కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
నవంబర్ 2న కౌంటింగ్
నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ జరగనుంది. అదేరోజు అభ్యర్థుల భవితవ్యంపై ప్రజా తీర్పు వెలువడనుంది. పోలింగ్ సమయం ముగిసిన తరువాత కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించటం..భారీ పోలింగ్ ఎవరికి మేలు చేస్తుందనే అంచనాల్లో పార్టీలు నిమగ్నమయ్యాయి. బీజేపీ నేతలు మాత్రం తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈటల మీద సానుభూతి..ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగానే ఇంత భారీ మొత్తంలో పోలింగ్ జరిగిందనేది బీజేపీ నేతల విశ్లేషణ. వారు ఎగ్జిట్ పోల్స్ ను ప్రస్తావిస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు... విజయం పైన అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే, ఎవరి అంచనాలు ఎలా ఉన్నా..ఓటరు తీర్పు ఏంటనేది మాత్రం తేలాంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.