బ్యాలెట్ వార్ కు బారులు తీరిన రైతులు ... నిజామాబాద్ లో ఉత్కంఠ పోరు
లోక్సభ ఎన్నికల పోరు తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా మారనుంది. ముఖ్యంగా నిజామాబాద్ లోక్ సభా నియోజకవర్గం లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరుకోవటంతో ఈ రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వెయ్యటానికి సిద్ధం అయ్యారు నాయకులు. అటు రాజకీయ నాయకులే కాదు వందల సంఖ్యలో రైతులు సైతం నామినేషన్లు వెయ్యటానికి ఉదయం నుండి బారులు తీరారు. దీనితో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి.

నామినేషన్ వెయ్యటానికి బారులు తీరిన 400 మంది రైతులు
బ్యాలెట్ పోరు కోసం నిజామాబాద్ రైతులు క్యూ కట్టారు. వందల సంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేయడానికి బారులు తీరారు. ఎన్నికల కార్యాలయం ముందు ఉదయం 10 గంటల నుండి సుమారు 300 నుండి 400 మంది రైతులు నామినేషన్ వెయ్యటం కోసం తరలి వచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలపట్ల స్పందిస్తుందేమో అని ఎదురు చూసిన రైతులు నామినేషన్ వెయ్యటానికి చివరి రోజు కావటంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ వేసేందుకు వస్తున్న రైతులను అడుగడగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ .

రైతులతో క్రిక్కిరిసిన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం .. నిన్నటి వరకు రైతుల నామినేషన్లు 56
నిన్నటి వరకు నిజామాబాద్ నియోజక వర్గంలో రైతుల నుండి 56 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక వందల సంఖ్యలో రైతులు నేడు నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు. పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు వేయడానికి కలెక్టరేట్ కార్యాలయం వద్ద బారులు తీరారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. భారీగా తరలి వచ్చిన రైతులతో కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం అంతా క్రిక్కిరిసిపోయింది.

గ్రామానికి 5గురు చొప్పున నామినేషన్ల దాఖలు
పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలంటూ కొన్నాళ్లుగా నిరసనలు తెలుపుతున్న నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు రైతులు చివరి అస్త్రం ఎంచుకున్నారు. తమ ఆవేదనను దేశవ్యాప్తంగా వినిపించేందుకు బ్యాలెట్ పోరు ఎంచుకున్నారు. నిజామాబాద్ అర్బన్ మినహా 6 నియోజకవర్గాల రైతులు గ్రామానికి ఐదుగురు చొప్పున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు.

గిట్టుబాటు ధరపై ప్రకటన ఇస్తేనే .. నామినేషన్ల ఉపసంహరణ అంటున్న రైతులు
మార్చి 25వ తేదీ సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆఫీసు వద్ద రైతులు నామినేషన్ వేయడానికి క్యూలో నిలుచున్నారు. ఎర్రజొన్న రైతులు, పసుపు రైతులు నామినేషన్లు వారిలో ఉన్నారు. రైతులు వరుసబెట్టి నామినేషన్లు దాఖలు చేస్తుండడంతో ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. స్పష్టమైన ప్రకటన చేస్తే గాని నామినేషన్లను ఉపసంహరించుకునేది లేదని రైతులు తేగెసి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications