గర్భవతియైన భార్యను హతమార్చి రంపంతో ముక్కలుగా కోసి మూసీలో పారేసిన భర్త.. ఆపై!
సమాజంలో రోజురోజుకీ దారుణ ఘటనలు పెరిగిపోతున్నాయి. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లి బాలాజీ హిల్స్ లో అటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యను భర్త హతమార్చి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి కవర్లలో ప్యాక్ చేసి మూసీ నదిలో పారేసిన ఘటన సభ్యసమాజాన్ని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది.
ప్రేమ పెళ్లి... భార్యాభర్తల మధ్య గొడవలు
వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ కు చెందిన 25 సంవత్సరాల స్వాతి, మహేందర్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం మేడిపల్లి బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా సమాచారం.

పోలీసులకు పక్కింటి వారి సమాచారం
ఈ క్రమంలోనే మహేందర్ తన భార్య స్వాతిని హతమార్చి, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి, కవర్లలో ప్యాక్ చేసి గుట్టు చప్పుడు కాకుండా మాయం చేశాడు. ఇక స్వాతి శరీర భాగాలను మహేందర్ మూసీ నదిలో పడేసాడు. అయితే పక్కింటి వారు మహేందర్ వాళ్ళ ఇంట్లో నుండి వచ్చిన అనుమానాస్పద శబ్దాలు గమనించి, కవర్లలో మానవ శరీర భాగాలు తీసుకు వెళ్లడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అయితే ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పోలీసులు నిందితులు మహేందర్ ను అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విచారణలో స్వాతి శరీర భాగాలను ముక్కలుగా నరికి మూసీనదిలో పడేసినట్టు మహేందర్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ శరీర భాగాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
మహేందర్ ఎందుకు భార్య స్వాతిని ఇంత దారుణంగా హతమార్చారు
ఇప్పటివరకు మృతదేహంలోని ఛాతి భాగాన్ని స్వాధీనం చేసుకోగా, మిగిలిన శరీర భాగాలు దొరకాల్సి ఉంది. అయితే మహేందర్ ఎందుకు భార్య స్వాతిని ఇంత దారుణంగా హతమార్చారు అన్నదానిపైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన పైన హత్యకు గురైన స్వాతి తల్లి మాట్లాడుతూ తమ కుమార్తెను మాయ చేసి తీసుకువెళ్లాడని మహేందర్ పైన ఆరోపణలు చేశారు.
మహేందర్ పై స్వాతి తల్లి ఆరోపణ
డిగ్రీ చదువుతున్న నా కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడని, మహేందర్ మాయలో పడి నా కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. ప్రేమ వివాహం వద్దని చెప్పి మేము వారించాం.. మా మాట వినకుండా మహేందర్ను పెళ్లి చేసుకుందని స్వాతి తల్లి లబోదిబోమని విలపించారు. కొన్ని రోజులుగా నా కూతురిని చిత్రహింసలు పెడుతున్నారని చెబుతోంది.. స్వాతి అత్తమామలు, మహేందర్ కలిసి తమ కూతురిని చంపారని స్వాతి తల్లి ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications