పెళ్ళయి నెలరోజులే; కుందనపు బొమ్మలాంటి భార్య గొంతు కోసి ఆపై ... శాడిస్ట్ భర్త ఘాతుకం !!
తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధువు, పెళ్లయిన నెల రోజులకే తిరిగిరాని లోకాలకు చేరిపోయింది. భర్తతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్న ఆమె భర్త కాలయముడుగా మారతాడని ఊహించలేకపోయింది. హైదరాబాదులోని బాచుపల్లి పరిధిలోని ప్రగతి నగర్ లో జరిగిన దారుణ ఘటనలో నూతనంగా పెళ్లి చేసుకున్న వధువు ప్రాణాలు కోల్పోయింది.
భార్యపై అనుమానం .. గొంతు కోసి హతమార్చిన భర్త
అసలేం జరిగిందంటే ప్రగతి నగర్ కు చెందిన కిరణ్ కు 22 సంవత్సరాల వయసున్న సుధారాణి అనే యువతితో నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. మేళతాళాలతో, వేదమంత్రాలతో బంధుమిత్రుల సాక్షిగా జరిగిన వివాహం భర్త కిరణ్ అనుమానంతో మూన్నాళ్ల ముచ్చటే అయింది. కుందనపు బొమ్మలాంటి సుధారాణిని వివాహం చేసుకున్న కిరణ్ పెళ్లయిన తర్వాత నుండి భార్య మీద అనుమానం పెట్టుకున్నాడు. అనుమానం కాస్తా పెరిగి పెద్దది కావడంతో శనివారం అర్ధరాత్రి సమయంలో భార్య సుధారాణి గొంతుకోసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన భర్త
తన చెయ్యి కోసుకొని కిరణ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భర్త దాడిలో మృతి చెందిన సుధారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కిరణ్ ను పోలీసులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కిరణ్ భార్య గొంతు కోసి హతమార్చేంతగా ఇద్దరి మధ్య ఏం జరిగిందన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కిరణ్ ఇంటిపై దాడి చేసిన మృతురాలి బంధువులు
కిరణ్, సుధారాణి మొబైల్ ఫోన్లో డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. పెళ్లయిన నెల రోజులకే ఏం జరిగి ఉంటుంది అన్నదానిపై వారి కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నో ఆశలతో కొత్త కాపురం లో అడుగు పెట్టిన కూతురు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడంతో సుధారాణి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కామారెడ్డి లోని కిరణ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సుధారాణిలా నిత్యం ఎందరో వేధింపులకు బలి
ఒక్క సుధారాణి మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఏదో ఒక రకంగా హింసకు గురి అవుతూనే ఉన్నారు. అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. కట్టుకున్న భర్తలే కాల యముళ్ళుగా మారి ఎంతో మంది మహిళల ప్రాణాలు తీస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే భార్యలను విగత జీవులుగా మారుతున్నారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ వేదమంత్రాల సాక్షిగా పెళ్ళాడి, ఆపై అత్యంత క్రూరంగా అర్ధాంగిని హతమారుస్తున్నారు .
అనుమానంతో భార్యల ప్రాణాలు తీస్తున్న భర్తలు ఎందరో
కట్నం డబ్బుల కోసం వేధిస్తున్న వారే కాదు కూర సరిగా వండలేదని కొందరు, అనుమానంతో మరికొందరు మహిళల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కాళ్ళ పారాణి ఆరక ముందే, కొత్త జీవితంలో అడుగు పెట్టిన ఎందరో భర్తల దాష్టీకాలకు బలైపోతున్నారు. నిత్య నరకం చూస్తున్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా సరే మగాళ్ళ ఆలోచనలో మార్పు రావటం లేదు. ఫలితంగా నిత్యం అనేక చోట్ల మహిళలు బలై పోతున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.