ఏడాదికే విడాకులు, మరో యువకుడితో లవ్ మ్యారేజీ, చివరికి శవమై...
కరీంనగర్: అంతకుముందే వివాహమై పిల్లాడు ఉన్నాడని తెలిసి ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు ఏడాది కాలం తర్వాత భార్య, భర్తల మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. కట్టుకొన్న భార్యను కిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. ఈ ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో చోటు చేసుకొంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటకు చెందిన అప్పాల స్వదేశ్, భాగ్యలక్ష్మి దంపతులకు ప్రియాంక అనే కుమార్తె ఉంది. 2012లో మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన హరికృష్ణతో ఆమెకు వివాహం జరిగింది.
ఏడాదిపాటు వీరిద్దరి మధ్య కాపురం సజావుగానే సాగింది. వీరికి కొడుకు పుట్టాడు. అతడికి సాత్విక్ అనే పేరు పెట్టారు. కొడుకు పుట్టిన తర్వాత ప్రియాంకకు ఆమె భర్త హరికృష్ణకు మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు.
విడాకుల తర్వాత మరో యువకుడి ప్రేమలో
ప్రియాంక భర్త హరికృష్ణతో విడాకులు తీసుకొంది. కొడుకు సాత్విక్ తో కలిసి పుట్టింట్లో ఉంటుంది. 2014లో హన్మకొండలోని ఓ ప్రైవేట్ కంప్యూటర్ సెంటర్లో ఇంగ్లీష్ కోచింగ్ తీసుకొనేది. ఆ సమయంలో ఆమెకు హన్మకొండ మండలంలోని బోగంపాడు గ్రామానికి చెందిన కాసం దేవేందర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది.వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.
దేవేందర్ రెడ్డితో పెళ్ళి
కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో దేవేందర్ రెడ్డితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో తనకు ఇదివరకే వివాహమైందని కొడుకు కూడ ఉన్నాడని దేవేందర్ రెడ్డికి ప్రియాంక చెప్పింది. ఈ విషయాలు తెలిసి దేవేందర్ రెడ్డి ఆమెను వివాహం చేసుకొనేందుకు అంగీకరించాడు. కానీ, దేవేందర్ రెడ్డి కుటుంబంలో ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రియాంక కుటుంబసభ్యులు చెబుతున్నారు. 2014లో దేవేందర్ రెడ్డి ప్రియాంకలు హూజూరాబాద్ ఆలయంలో వివాహం చేసుకొన్నారు.
భార్య, భర్తల మధ్య విభేదాలు
దేవేందర్ రెడ్డి, ప్రియాంకల వివాహనికి దేవేందర్ రెడ్డి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ సమయంలో ప్రియాంక తల్లిదండ్రులు కొంత డబ్బును సమకూర్చి వారితో హన్మకొండలో కాపురం పెట్టించారు. వీరిద్దరికి ఓ కొడుకు పుట్టాడు. అయితే భార్య,భర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి. విడిపోయారు. పెద్దల సమక్షంలో పలు దఫాలు పంచాయితీలు కూడ నిర్వహించారు. దీంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
అనుమానాస్పదంగా మృతి
ప్రియాంక, దేవేందర్ రెడ్డి విడాకుల కేసు శనివారం నాడు హూజురాబాద్ కోర్టులో ఉంది. ఈ కేసుకు హజరయ్యారు. ఈ కేసుకు హజరైన సందర్భంగా ప్రియాంక కొడుకు దేవేందర్ రెడ్డికి కూల్ డ్రింక్ కోనిచ్చాడు. అయితే కిరాణషాపులో డబ్బులు చెల్లిస్తానని బయటకు వచ్చిన ప్రియాంక దేవేందర్ రెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్ళింది. ఊరి బయట కాలువ వద్ద ప్రియాంక మృతదేహం పడి ఉంది. అయితే ప్రియాంకను దేవేందర్ రెడ్డి కొట్టి చంపారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.