ఐదో పెళ్లికి రెడీ: వాట్సాప్ ‘తలాక్’ నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసులు!
దేశంలో ‘తలాక్’ రద్దుపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు దిగ్భ్రాంతికర ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
హైదరాబాద్: దేశంలో 'తలాక్' రద్దుపై విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు దిగ్భ్రాంతికర ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ మహిళకు తన భర్త వాట్సప్లో తలాక్ అంటూ పంపంచి తమ వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలోనూ చోటు చేసుకుంది.
ఈక్రమంలో పాతబస్తీలో జరిగిన వాట్సాప్ తలాక్ వివాదంలో నిందితుడు అబ్దుల్పై పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయనున్నారు. అబ్దుల్కు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయినట్లు సమాచారం. ముగ్గురు యువతులకు తలాక్ ఇచ్చిన అబ్దుల్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చౌక్ మైదాన్ఖాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అఖిల్ అలియాస్ ఉస్మాన్ ఖురేషీ(25) గతంలో ముగ్గురు యువతులను పెళ్లి చేసుకుని తలాక్ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం మలక్పేటకు చెందిన మెహరీన్ నూర్ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అఖిల్.. నగరంలోనే మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఇప్పటికే అతని తల్లిదండ్రులు ఓ సంబంధం కూడా చూశారు. దీంతో మెహరీన్ను వదిలించుకోవడానికి ఫిబ్రవరి నెలలో ఆమెకు తలాక్ ఇస్తున్నట్లు లేఖ పంపాడు. ఆమె ఆ లేఖను తీసుకోకపోవడంతో వాట్సాప్లో మళ్లీ తలాక్ సందేశం పంపించాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న చాదర్ఘాట్ పోలీసులకు మెహరీన్ ఫిర్యాదు చేయడంతో అఖిల్పై 498ఎ కింద కేసు నమోదు చేశారు.
అత్తమామలు అబుబాకర్ ఖురేషీ, అతియా కుల్సుంలు కూడా తనను వేధించడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డారని మార్చి 2న మెహరీన్ మొఘల్పురా పోలీసులకు ఫిర్యాదుచేయడంతో వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అమెరికా నుంచి రావడం, నచ్చిన యువతిని పెళ్లిచేసుకుని కొన్నిరోజులు కాపురం చేసి తలాక్ ఇవ్వడం అబ్దుల్ఆఖిల్కు అలవాటుగా మారిందని డీసీపీ సత్యనారాయణ తెలిపారు.
కాగా, వాట్సాప్లో తలాక్ ఇచ్చిన అబ్దుల్ అఖిల్పై దక్షిణ మండలం పోలీసులు ఎల్ఓసీ జారీచేశారు. సీఐడీ ద్వారా రెడ్కార్నర్ నోటీసునూ జారీచేసి నిందితుడిని అమెరికా నుంచి రప్పించి అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. తనపై కేసు, తల్లిదండ్రులను అరెస్టుచేశారని తెలిసి అఖిల్ రెచ్చిపోయాడు. ప్రధాని మోడీ, ట్రంప్ తనను ఏమీ చేయలేరని వాట్సాప్లో మెహరీన్కు మళ్లీ సందేశాలు పంపాడు. దీంతో మెహరూన్, ఆమె తోటికోడలు సయిదా హీనాలు ఆదివారం ప్రధానితోపాటు అమెరికా అధ్యక్షుడికి, అమెరికా విదేశాంగశాఖకు అతడు పంపిన సందేశాలను జతచేస్తూ లేఖలు రాశారు.