ఆఫీస్ మిషనరీ మిస్యూజ్: కమిషనర్ పైన సిఐ సంచలన ఆరోపణలు
పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు హుస్నాబాద్ నుంచి పంపించాలని తనను బదలీ చేశారని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య ఆదివారం ఆరోపించారు.
హుస్నాబాద్: పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు హుస్నాబాద్ నుంచి పంపించాలని తనను బదలీ చేశారని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య ఆదివారం ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నిబంధనల ప్రకారమే పని చేస్తున్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో తనను సీపీ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కరీంనగర్ జిల్లా ఎస్పీగా పని చేసిన సీపీ శివకుమార్ కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సిద్దిపేట కమిషనర్గా నియమించబడ్డారు.
గతంలో ఆయన తన పైన కక్ష పెంచుకొని కొత్త జిల్లాలోను వేధిస్తున్నారన్నారు. నిబంధల ప్రకారమే తాను వ్యవహరిస్తున్నా ఏదో కారణం చూపి కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు తన పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే తనను బదలీ చేసి సంగారెడ్డి డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారన్నారు. ఉన్నతాధికారులకు స్థానిక రాయకీయ నాయకులు తోడవడంతో వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు.
తాను విధి నిర్వహణలోగానీ, ఇతరత్రా గానీ నిబంధనలకు విరుద్దంగా నడుచుకోలేదన్నారు. అలాంటప్పుడు తన పైన కక్ష సాధింపు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అప్పటి డీజీపీని నిలదీసినందుకు ఇప్పుడు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తాను 20 రోజులుగా సిక్ వ్లో ఉన్నానని, విధుల్లో చేరేందుకు వస్తుండగా.. తనకు బదలీ అయిందని, స్టేషన్కు వెళ్లవద్దని, జీపు వాడవద్దని చెప్పారని అన్నారు. తనకు బదిలీ ఆర్డర్ రాలేదన్నారు. ప్రొసీజర్ ప్రకారం కొత్తగా వచ్చే సీఐకి చార్జి అప్పగించి వెళ్తానని చెప్పినా వినలేదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఘటన కారణంగానే తన పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అప్పట్లో హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో జై తెలంగాణ అని నినాదాలు చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్ను యూనిఫాంలో లేని పోలీసులు కొట్టారని, దాంతో, పోలీస్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న తాను అప్పటి డీజీపీకి వ్యతిరేకంగా మాట్లాడానని, అప్పుడు కరీంనగర్ ఎస్పీగా ఉన్న శివకుమార్ తనకు రెండు చార్జి మెమోలు ఇచ్చి సీఐడీకి బదిలీ చేయించారని, అలాగే, అమరుల భవన నిర్మాణ అవకతవకలపై ఆర్టీఐ కింద లెక్కలు అడిగానని, దీనికి నాపై కక్ష పెంచుకున్నాడన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు చొరవతో తనకు మళ్లీ హుస్నాబాద్ సీఐగా బదిలీ అయిందని, విధుల్లో ఉండగానే జీపు వాడొద్దని, కుర్చీలో కూర్చోవద్దని, స్టేషన్కు వెళ్లవద్దని నిబంధనలకు విరుద్ధంగా ఆంక్షలు విధించారన్నారు.
తన వద్దకు వచ్చి రిపోర్ట్ చేయాలని సీపీ ఆదేశించడమేమిటని ప్రశ్నించారు. యూనిఫాం వేసుకున్న తనను జీపు వాడద్దని అంటున్నారని, సీపీ భార్య ప్రభుత్వానికి చెందిన టవెరాను ఉపయోగిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వారు ప్రభుత్వ వాహనం వాడితే తప్పు కాదు కానీ, నేను సీనియర్ పోలీస్ ఉద్యోగిగా డ్యూటీలో ఉండి వాహనం వాడవద్దా అని నిలదీశారు. అధికారిక మిషనరీని సీపీ మిస్ యూజ్ చేస్తున్నారన్నారు.