Huzurabad By-poll: కేసీఆర్ డైరెక్షన్ లోనే వీవీ ప్యాట్ల తరలింపు ... కేసీఆర్ కు ఓటమి భయం: భగ్గుమన్న బండి సంజయ్
హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయం సీఎం కేసీఆర్ కు పట్టుకుందని, ఆ భయంతోనే సీఎం కెసిఆర్ డైరెక్షన్లోనే కారులో వీవీ ప్యాట్ లను తరలించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని అసెంబ్లీ సమీపంలోని సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన బండి సంజయ్ హుజురాబాద్ నియోజక వర్గ ఎన్నికల్లో టీఆర్ఎస్ తీరుపై ఫైర్ అయ్యారు.
నిబంధనలకు విరుద్ధంగా కారులో వీవీ ప్యాట్ల తరలింపు
వీవీ ప్యాట్లు పనిచేయడం లేదని ఏజెంట్లకు చెప్పకుండా ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. వీవీ ప్యాట్లు పని చేయడం లేదన్న సాకుతో ఎవరికీ చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా కారులో ఎలా తరలిస్తారని బండి సంజయ్ నిలదీశారు. వివి ప్యాట్ లను తరలించడంపై తమకు అనుమానాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసిన బండి సంజయ్ ఈ విషయంపై ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.
సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారు
అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో ఓటుకు రూ.6 నుండి రూ.20 వేల వరకు పంచి ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ ఖూనీ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు ఈ ఘటనతో యావత్ తెలంగాణ ప్రజానీకం తలదించుకునే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్న బండి సంజయ్ నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన టీఆర్ఎస్ వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న బండి సంజయ్
ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ నివేదికల ఆధారంగా బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతుందని బండి సంజయ్ వెల్లడించారు .టిఆర్ఎస్ అప్రజాస్వామికంగా ఎన్నికల నియమావళికి తూట్లు పొడిచి, ఎంత ప్రయత్నం చేసిన హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లు ధర్మం వైపే నిలిచారని ప్రజలను, ఎంత ప్రలోభాలకు గురి చేసినప్పటికీ న్యాయానికి కట్టుబడ్డారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. కెసిఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు మంచి ఆలోచనతో బీజేపీని ఆదరించారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీపై ఎంత ఒత్తిడి తెచ్చినా, ప్రజలను ప్రలోభపెట్టినా సరే .. విజయం ఈటలదే
పార్టీ శ్రేణుల నుండి అందిన సమాచారం ప్రకారం హుజూరాబాద్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బిజెపి విజయం సాధించబోతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. మొదటి నుంచి సీఎం కేసీఆర్ కు ఓడిపోతామని తెలుసు అని ఓటమి భయంతోనే అడ్డదారులు తొక్కారని బండి సంజయ్ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు బిజెపి వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అధికార యంత్రాంగంతో బీజేపీ పై ఒత్తిడి తీసుకొచ్చి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసినా లెక్కచేయకుండా బిజెపి విజయం కోసం కార్యకర్తలు పని చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు