ఈటలకు మంత్రి హరీష్ సవాల్: నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేదంటే ఎన్నికల నుండి తప్పుకుంటావా!!
హుజురాబాద్ లో ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. బిజెపి తరఫున పార్టీ నుండి సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొంటే, టిఆర్ఎస్ పార్టీ నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హుజురాబాద్ ఉపఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్న తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ తన ప్రచారంలో పాల్గొంటున్నారు.
హుజురాబాద్ వార్: బీజేపీకి ఓటేస్తే .. బండి సంజయ్, ఈటలకు బాల్క సుమన్ సూటి ప్రశ్నలు
దమ్ముంటే ధరలను తగ్గించండి .. బీజేపీ నేతలకు మంత్రి హరీష్ సవాల్
హుజురాబాద్ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. అంతేకాదు విపరీతంగా పెరిగిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలపై, గ్యాస్ ధరలపై, నిత్యావసర వస్తువుల ధరలపై బిజెపి నేతలకు సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే ధరలు తగ్గించడంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ప్రచారంలో మరింత దూకుడు పెంచిన హరీష్ రావ్ ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు.
ఈటలకు హరీష్ రావ్ సవాల్ .. గ్యాస్ సిలెండర్ ధరలపై రచ్చ
బీజేపీని బలహీనపరిచే ప్లాన్ లో భాగంగా పెరిగిన ధరల పైన టార్గెట్ చేస్తున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు. గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూపాయలు రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే, అంటూ సవాల్ విసిరారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర పన్ను లేదని తేలితే ఎన్నికల నుండి తప్పకుంటావా అంటూ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రేపు రావాలా? ఈరోజు రావాలా? జమ్మికుంటలో అయినా సరే, హుజురాబాద్ లో అయినా సరే అంటూ పేర్కొన్న హరీష్ రావు ప్లేసు, టైము డిసైడ్ చేసే ఛాన్స్ ఈటల రాజేందర్ కు ఇస్తున్నా అంటూ పేర్కొన్నారు.
తాను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా అన్న హరీష్ రావు
ఈటల రాజేందర్ తాను చెప్పింది తప్పని నిరూపిస్తే హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ కు మంత్రి హరీష్ రావు చేసిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వంట నూనెలు, గ్యాస్ ధరలు పెరగడానికి బిజెపి కారణమని, బీజేపీకి ఓటేస్తే పెరిగిన ధరలకు మద్దతు ఇచ్చినట్టు అవుతుందని టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం నుండి జిఎస్టి పన్నుల వసూళ్లు అన్నీ కేంద్రానికి చేరుకున్నాయని, కానీ కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని ప్రచారం సాగిస్తున్నారు.
గ్యాస్ ధరలపై, జీఎస్టీ వసూళ్ళపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
అయితే గ్యాస్ ధరలలో రాష్ట్రం విధిస్తున్న పన్నులు కూడా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించుకుంటే గ్యాస్ ధరలు తగ్గుతాయి అంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు. జిఎస్టిలో రాష్ట్రం వాటాపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు ఈటెల రాజేందర్ కు సవాల్ విసిరారు. ఇక జీఎస్టీ లో కేవలం ఐదు శాతం మాత్రమే రాష్ట్ర వాటా ఉందని అది కూడా 47 రూపాయలు మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మరి ఈ సవాల్ ను ఈటల తీసుకుంటారా? తెలియాల్సి ఉంది.