కేసీఆర్ లక్ష కోట్లకు రేవంత్ రెడ్డి కౌంటర్ -లక్ష మందితో దళిత దండోరా -ఆర్ఎస్ ప్రవీణ్కు కాంగ్రెస్ ఆహ్వానం
అధికారికంగా షెడ్యూల్ విడుదల కాకముందే, అసలు కరోనా నేపథ్యంలో ఇప్పుడప్పుడే జరుగుతుందానే అనుమానాలు తీరకముందే, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికపై అసాధారణ రీతిలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఉప ఎన్నికలో గెలవడానికే కొత్త పథకాలు తెస్తున్నామన్న సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లోనే ప్రయోగాత్మకంగా చేపడతామని, ఆ కార్యక్రమానికి అవసరమైతే రూ.1లక్ష కోట్లయినా ఖర్చు పెడతామని చెప్పారు. సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ కౌంటర్ కార్యక్రమాలను ప్రకటించారు..
ఏలూరు మేయర్గా మళ్లీ నూర్జహాన్ -పవన్-బీజేపీ తుస్, టీడీపీకి 3 -ఎన్నికల పూర్తి ఫలితాలివే
లక్ష మందితో దండోరా..
ఆగస్టు 9న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా నిర్వహిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. ఆదివారం మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావును సికింద్రాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రేవంత్.. స్థానిక చిరాన్ పోర్ట్ క్లబ్లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
దళితుల పేరుతో కేసీఆర్ డ్రామాలు
బంధుత్వానికి, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానన్న రేవంత్రెడ్డి కాంగ్రెస్ జెండా దించకుండా మోసిన వారే తన బంధువులని స్పష్టం చేశారు. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ధనిక రాష్ట్రంగా కేసీఆర్ చేతిలో పెడితే దివాళా తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ఉప ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్కు పథకాలు గుర్తుకొస్తున్నాయని, ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారని విమర్శించారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 1.35 కోట్ల మంది దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాలో వేసుకుంటాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17వరకు దళిత గిరిజన దండోరా మోగిస్తామని వెల్లడించారు.
షాక్:సీబీఐ జేడీ చేసింది చాలా తక్కువ -జగన్ లూటీలు అన్నీ మోదీకి చెప్పేస్తా -ఎంపీ రఘురామ రియాక్షన్
Recommended Video
ఆర్ఎస్ ప్రవీణ్కు కాంగ్రెస్ స్వాగతం
దళిత బంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. ఆ మోసాలన్నింటినీ బయటపెట్టాలని, ఇందులో భాగంగా ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 'దళిత దండోరా' చేపడుతున్నట్లు మధు యాష్కి, జగ్గారెడ్డి, రాజనర్సింహ తదితర నేతలు చెప్పారు. ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ కలిసి వస్తానంటే కాంగ్రెస్ స్వాగతం పలుకుతుందని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన కోదండరాం, చెరుకు సుధాకర్, గద్దర్, విమలక్కతో పాటు తెలంగాణ వాదులందరినీ తమతో చెయ్యి కలపాలని కాంగ్రెస్ ఆహ్వానిస్తున్నదని నేతలు చెప్పారు.