కేసీఆరే వెన్నుపోటు పొడిచారు: ఈటల రాజేందర్ హెచ్చరిక, కేటీఆర్ నిందలు అందుకేనంటూ డీకే అరుణ
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక తేదీ దగ్గరపడుతున్నకొద్ది ప్రధాన పార్టీలు ప్రచార జోరును మరింతగా పెంచాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరపున మంత్రి హరీశ్ రావు విస్లృతంగా ప్రచారం చేస్తుండగా.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అందరికంటే ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. హుజూరాబాద్ ప్రజలు తనవైపే ఉన్నారని.. తన గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఈటల ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్వన్నీ అబద్ధాలు, మోసాలే..: ఈటల
తాజాగా, హుజూరాబాద్ మండలం సింగాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలు, మోసేలేనని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ మీటింగ్కి పోవద్దు అని డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్తితికి టీఆర్ఎస్ దిగజారిందని విమర్శించారు

తనకు వెన్నుపోటు పొడిచింది కేసీఆరేనంటూ ఈటల హెచ్చరిక
ఈటల రాజేందర్. పిల్లిని రూంలో వేసి కొడితే తిరగబడుతుందని.. ప్రజలను కూడా ఎక్కువ ఇబ్బంది పెడితే వదిలిపెట్టరని.. జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ను హెచ్చరించారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని, ఇది అనైతికమని వ్యాఖ్యానించారు. తనకు వెనుపోటు పొడిచింది.. ద్రోహం చేసి కళ్లల్లో మట్టి కొట్టింది కేసీఆరేనని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. 18 ఏళ్ల నుంచి ఉద్యమం కోసం వాడుకున్న వ్యక్తి కేసీఆర్ అని, తనను కుడి భుజం, ఎడమ భుజం అని ద్రోహం చేశారన్నారు. సీఎం పదవి కాలి గోటితో సామనమని నేడు ఆ పదవిని ఎందుకు వదలడం లేదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ప్రజలు మనని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని ఈటల రాజేందర్ కోరారు.

అందుకే ఈటలపై కేటీఆర్ నిందలు: డీకే అరుణ్ ఫైర్
మరోవైపు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. రేవంత్, ఈటల భేటీ ఫొటోలు ఉంటే భయటపెట్టాలని కేటీఆర్కు డీకే అరుణ సవాల్ విసిరారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలుచేయడం టీఆర్ఎస్కి అలవాటేనని, ఓడిపోతామన్న భయంతో టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. లోపాయికారీ ఒప్పందం చేసుకోవడంలో కాంగ్రెస్ దిట్ట అని అన్నారు. తనను సీఎం కాకుండా ఈటల రాజేందర్ అడ్డుకున్నారనే కోపంతో ఈటలపై కేటీఆర్ నిందలు వేస్తున్నారని అన్నారు. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు నాలుగు రోజులే ఉండటంతో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయా పార్టీల కీలక నేతలు అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications