Huzurabad bypoll: ఈటల రాజేందర్ వర్సెస్ హరీశ్ రావుగా మారిన సీన్
హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ ఉపఎన్నికలో తాను తిరిగి విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అవిశ్రాంతిగా శ్రమిస్తుండగా.. ఎలాగైనా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో గెలవాలని అధికార టీఆర్ఎస్ కూడా అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హరీశ్ రావు రంగంలోకి దిగడంతో ఈటల వర్సెస్ హరీశ్ అన్నట్లుగా సీన్ మారిపోయింది.

కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతోందంటూ ఈటల
గురువారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఈటల రాజేందర్.. తన పాదయాత్రను ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభిస్తానని తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన గురువారం హుజురాబాద్లో కార్యకర్తలను కలిసి మాట్లాడారు. కాళ్ల కింద భూమి కదిలిపోయి, భవిష్యత్తు శూన్యం, అంధకారమే కనిపిస్తుండటంతో కేసీఆర్కు ఏమీ తోచడం లేదని, ఈ విషయాలన్నీ ప్రజలకు సులభంగా అర్థమవుతున్నాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలను తొక్కిపెట్టేలా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

నీ దగ్గర ఎన్ని వేల కోట్లున్నాయ్ కేసీఆర్..
ఓట్లు కొనేవాళ్ల నాయకులు అవుతారా? అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ 150 కోట్లు హుజురాబాద్లో ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. ఓట్లను కొనుగోలు చేసేవాళ్లను బ్రోకర్లంటారు, పనిచేసి ప్రజల ప్రేమను పొందితేనే నాయకుడవుతారని ఆయన వ్యాఖ్యానించారు. హుజూరాబాద్లో ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి పనిచేస్తూ ఇన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక కాబట్టే కోట్లు ఖర్చు చేసి ఓట్లను కొంటామంటున్నకేసీఆర్.. రేపు తెలంగాణ అంతటా ఓట్లు కొనగలవా ? .. అయితే నీ దగ్గర ఎన్ని వేల కోట్లున్నాయి? అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిలదీశారు.

హుజూరాబాద్లో ఏం జరుగుతుందో ఈసీ గమనిస్తోంది..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఇంటికొకరు వచ్చి మనకోసం పనిచేస్తారనే విషయం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఎవరి ఆటలు సాగనివ్వదని ఆయన అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించే వారిపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తుందని ఆయన గుర్తు చేశారు. హుజూరాబాద్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఈసీ గమనిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ పట్టం కడుతున్నారని ఈటల విమర్శించారు. మానుకోటలో మన మీద రాళ్లేసిన వ్యక్తికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ఉద్యమం సమయంలో మాకు చెప్పులు చూపించి రాళ్లతో దాడిచేసి చాలా మంది రక్తం కళ్ల చూశాడని ఆయన ఆరోపించారు. రాళ్ల దాడి ఘటనలో 19 మంది గాయపడ్డారని, ఈ విషయం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా తెలుసన్నారు. ఉద్యమకారుల రక్తాన్ని కళ్ల చూసిన వ్యక్తికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చాడంటే కేసీఆర్ ఎవరిని గౌరవిస్తున్నట్లు ? అని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజీనామా చేయడంవల్ల ఎన్నో ఫలితాలొచ్చాయని బీఎస్ రాములు ఆర్టికల్ రాశారు.. ఈటల గెలిస్తే మరిన్ని ఫలితాలు వస్తాయని ఆయన చెబుతున్నారని ఈటల పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ వదిలిపెట్టి దళితుల బాట పట్టారని, ఆయనదంతా ఆర్టీఫిషియల్ ప్రేమ అని మాజీ మంత్రి ఈటల ఎద్దేవా చేశారు. హరీశ్ రావు తనపై చేస్తున్న విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఈటల కౌంటర్ ఇచ్చారు.

ఈటల రాజేందర్ ప్రచార శైలి మారిందంటూ హరీశ్ రావు..
మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ ఆర్థిక మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు విమర్శల వర్షం కురిపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లను చీల్చడానికి బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అక్కడ చీకటి ఒప్పందం చేసుకున్నారని హరీశ్రావు ఆరోపించారు. గురువారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బిజేపీ నేతలు సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో చూడగానే పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు గుర్తుకు వచ్చి ఓట్లు పడవనే ఉద్దేశ్యంతో ఈటల రాజేందర్ ప్రచార శైలి మార్చారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ప్రధాని మోడీ ఫోటో, బీజేపీ జెండాలను దాచి కేవలం తన ఫోటోను, తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని హరీశ్ ఎద్దేవా చేశారు.
Recommended Video

హుజూరాబాద్లో ఈటల గెలిస్తే ఏమవుతుందో చెప్పిన హరీశ్ రావు
బీజేపీ తరపున గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమనే విషయం అందరికీ తెలుసన్నారు హరీశ్ రావు. బీజేపీపై విశ్వాసం ఉంటే ఇదే ఈటల రాజేందర్ వెళ్లి మోడీ దగ్గర వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలరా? అంటూ ప్రశ్నించారు. ఈటల ఎత్తుగడలకు మోసపోయే పరిస్థితి హుజూరాబాద్లో లేదన్నారు. ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 దాటిందని, అక్కడ బీజేపీకి ఓటు వేస్తే వచ్చే ఏడాదిలో డీజిల్, పెట్రోల్ ధరలు రూ.200 దాటడం ఖాయమని, గ్యాస్ సిలిండర్ ధర రూ.1500 దాటుతుందని అన్నారు.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీని బండకేసి కొట్టారని మంత్రి హరీశ్రావు అన్నారు. రేపు హుజూరాబాద్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్ అనే వ్యక్తి గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం జరుగుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. వ్యక్తి ప్రయోజనం కంటే వ్యవస్థ ప్రయోజనమే ముఖ్యమన్నారు హరీశ్ రావు. కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికపై ట్రబుల్ షూటర్గా పేరున్న హరీశ్ రావు దృష్టి సారించడంతో ఇక్కడి రాజకీయం మరింత వేడెక్కినట్లయింది.












Click it and Unblock the Notifications