హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్ - ఈటలదే విజయం : ఏ సర్వే సంస్థ ఏం చెబుతోంది..!!
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఇక్కడ టీఆర్ఎస్...బీజేపీ..కాంగ్రెస్ తో సహా 35 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. అయితే, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కంటే.. కేసీఆర్ వర్సెస్ ఈటల అనే స్థాయిలో ప్రచారం నుంచి ఎన్నిక వరకు చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నిక విషయంలో అనేక సమీకరణాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ సైతం ఊహించని విధంగా రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసే సమయానికి అంటే ఈ సాయంత్రం 7 గంటలకు హుజూరాబాద్ లో 86.40 శాతం పోలింగ్ నమోదైంది.
రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు
ఇంకా పోలింగ్ కేంద్రా ల వద్ద ఓటర్లు ఉన్నారు. 2018 ఎన్నికల్లో 84 శాతం పోలింగ్ నమోదైంది. 90 శాతం వరకు ఈ సారి పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడయ్యాయి. అయితే, ఇంకా పోలింగ్ కొనసాగటం.. భారీ స్థాయిలో ఓటింగ్ జరగటం తో ప్రతీ సంస్థా తాము ఇచ్చిన సర్వే లెక్కలకు ప్లస్ ఆర్ మైనస్ 3 శాతంగా పేర్కొంటున్నాయి. ఇక, ప్రముఖంగా చూస్తే మిషన్ చాణక్య ఈ నెల 27వ తేదీ వరకు ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. అందులో బీజేపీకి 59.20 శాతం మంది మొగ్గు చూపగా.. టీఆర్ఎస్ వైపు 39.26 శాతం మద్దతుగా నిలిచినట్లుగా తేల్చారు.
బీజేపీదే గెలుపంటున్న మిషన్ చాణక్య
కాంగ్రెస్ ఒక శాతం లోపు ఓట్లకే పరిమితం కాగా..ఇతరులు సైతం అదే పరిస్థితిలో ఉన్నట్లుగా తేల్చారు. అయితే, చివరి రెండు రోజులు..పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు ఈ సర్వే అంచనాల మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే విధంగా.. నాగన్న సర్వే లెక్కల ప్రకారం.. టీఆర్ఎస్ గెలుపుబాటలో ఉంది. ఈ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. వీరి లెక్కల ప్రకారం బీజేపీ బీజేపీ 42.90 - 45.50 ఓట్లు సాధించగా..టీఆర్ఎస్ 45.30 - 48.90 వరకు ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది. అయితే, రెండు పార్టీల మధ్య హోరా హోరీగా చూపిస్తున్నా... గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపుతోంది.
ఈటలకే మెజార్టీ అని చెబుతున్న ఆత్మసాక్షి సర్వే
ఇక, ఈ సంస్థ కాంగ్రెస్ కు 2.25 శాతం నుంచి 4 శాతం వరకు ఓట్లు దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. మరో సర్వే సంస్థ ఆత్మసాక్షి సర్వే ప్రకారం బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 10,500 -12,300 ఓట్ల తేడాతో గెలుస్తారని లెక్కలు వేసింది. ఈ సంస్థ బీజేపికి 50.05 శాతం, టీఆర్ఎస్ కు 43.01 శాతం, కాంగ్రెస్ కు 5.07 శాతం మేర ఓట్లు పోలయినట్లు అంచనాలు వెల్లడించింది. ఇదే సంస్థ ఈ ఉప ఎన్నిక గురించి పలు ఆసక్తి కర అంశాలను ప్రస్తావించింది. దీనిని టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కాకుండా... కేసీఆర్ వర్సెస్ ఈటల గా ఓటర్లు చూసారని పేర్కొంది.
ప్రభావం చూపిన కారణాల విశ్లేషణ
దళిత బంధు ఈ నియోజకవర్గంలో అమలు చేయకపోవటం వ్యతిరేక ప్రభావం చూపించిందని అంచనా వేసింది. ఉద్యోగులతో పాటుగా నిరుద్యోగులు సైతం ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నారని సర్వే సంస్థ పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి అనుకూలంగా మారిందని విశ్లేషించింది. బీసీల్లోని మెజార్టీ వర్గాలు ఈటలకు బాసటగా నిలిచాయని వివరించింది. ఈటల నిత్యం ప్రజలతో మమేకం అయి ఉండటం .. కొద్ది నెలలుగా ఈటల లక్ష్యంగా మంత్రులు..గులాబీ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం సైతం ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపటానికి కారణంగా విశ్లేషించింది.
కారుదే గెలుపు అంటున్న పబ్లిక్ పల్స్ సంస్థ.
ఇక, మరో సర్వే సంస్థ పబ్లిక్ పల్స్ అంచనాల ప్రకారం.. టీఆర్ఎస్ కు 44.03 శాతం ఓట్లు, బీజేపీకి 50.09 శాతం ఓట్లు దక్కుతాయని తేల్చింది. కాంగ్రెస్ కు కేవలం 2.07 శాతం మాత్రమే వస్తాయని పేర్కొంది. మిషన్ చాణక్య, పొలిటకల్ లేబరేటరీతోపాటు హెచ్ఎంఆర్ రిసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, కౌటిల్యా సొల్యూషన్స్, ఆత్మసాక్షి గ్రూపులు క్లియర్ గా బిజెపి గెలుపును అంచనా వేస్తున్నాయి. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.