టీఆర్ఎస్ సభ రద్దు, వర్షం కారణంగా.. అంటూ నేతల వెల్లడి
హుజుర్నగర్లో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగసభ రద్దయింది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేస్తున్నట్టు సభ ఏర్పాట్లను పరిశీలీస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలు ప్రకటించారు. మరికాసేపట్లో సభ ప్రారంభం కానుండగా సభను వాయిదా వేస్తున్నట్టుగా టీఆర్ఎస్ నేతలు ప్రకటించడంతో కార్యకర్తలు ,ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు వర్షం కారణంగా ముఖ్యమంత్రి బయలుదేరాల్సిన హెలికాప్టర్కు ఏవీయోషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. ఇలాంటీ వాతవరణంలో హుజుర్నగర్కు వెళ్లడం కష్టంగా ఉంటుందని ఏవియోషన్ అధికారులు సూచించారు. దీంతో హెలికాప్టర్ పర్యటనను రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ప్రకటించారు.
ఇక భారీ వర్షం కురియడంతో సభ ప్రాంగణం అంతా బురదమయంగా మారింది. దీంతో సభకు వచ్చిన ప్రజలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు సభ ప్రారంభానికి ముందు వర్షం కురియడంతో కార్యకర్తలు కుర్చిలు, టెంట్లు,ఫ్లెక్సీ క్రింద తల దాచుకున్నారు. సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రజలు పూర్తిగా వర్షంలో తడవడంతో పాటు, మరోవైపు దట్టమైన మేఘాలు ఉండడంతో చివరికి రద్దు చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు.
హుజుర్నగర్ ఎన్నికలు అక్టోబర్ 21న జరగనున్న నేపథ్యంలోనే 19 వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సభ లేదా మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించాలని భావించారు. చివరకు భారీ బహిరంగ సభ నిర్వహించి సీఎం కేసీఆర్ పాల్గోనే విధంగా ప్లాన్ చేశారు. వర్షం కారణంతో సభ రద్దు కావడంతో మరో రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. దీంతో కేటీఆర్ రోడ్ను నిర్వహిస్తారా లేదా అనేది వేచి చూడాలి.